Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పర్యటన ముగిశాక.. రెచ్చిపోయిన పోలీసులు
- తమకు రక్షణ కల్పించాలని నిరసనకు దిగితే నరేంద్రమోడీ
- నియోజకవర్గం వారణాసిలో దారుణం..
- విద్యార్థినులపై లాఠీచార్జ్, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం
వారణాసి: ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకవర్గంలో పర్యటనలు ముగిశాక.. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఖాకీలు రెచ్చిపోయారు. విద్యార్థినులనే కనికరం కూడా లేకుండా లాఠీచార్జి చేశారు. రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. గత రెండు రోజులనుంచి వర్సిటీలో.. లైంగికవేధింపులకు వ్యతి రేకంగా ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సుమారు 45 గంటలకు పైనుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో వైస్ చాన్సలర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. శనివారం కూడా లంకా గేటు వద్ద శాంతియుతంగా వారు తమ నిరసనను తెలియజేస్తుండగా.. పోలీసులు రెచ్చిపోయారు. బీహెచ్యూ అధికారులు, జిల్లా అధికారయంత్రాంగం కనుసన్నల్లో పోలీసులు కండకావరాన్ని ప్రదర్శించారు. ముందస్తు వ్యూహంగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ చీకట్లో పోలీసులు విద్యార్థినులపై అరాచకానికి ఒడిగట్టారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. సాధారణంగా విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే.. మహిళ పోలీసులను రంగంలో దింపాలి. కానీ యోగి సర్కారు అందుకు భిన్నంగా మగపోలీసులను రంగంలోకి దింపింది. ఇదే అవకాశంగా భావించిన ఖాకీలు దొరికిన వారిని దొరికినట్టు స్టూడెంట్లను చితకబాదటం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా వీసీ లాంజ్ వద్ద విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చి లాఠీలు ఝుళిపించారు.రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. గాల్లోనూ కాల్పులు చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కరెంట్ కట్ చేయటంతో.. చీకటిలో ఎవరు కనిపిస్తే.. వారిని పట్టుకుని మరీ పోలీసులు కొట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో విద్యార్థినులకు గాయాలయ్యాయి.వారిని ట్రామా ఆస్పత్రికి తరలించారు.వర్సిటీ ప్రధాన మార్గాలన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బనారస్ హిందూ వర్సిటీ చుట్టూ భారీ పోలీసు బలగాలు మొహరించాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.