Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
- 19న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా దగ్గరకు వచ్చే అవకాశం
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం- దాని పక్క నున్న నైరుతి బంగాళాఖాతం మధ్య అల్పపీడనం కొనసాగుతున్నదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి వెల్లడించారు. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశాలున్నాయని తెలిపారు. 19న ఉత్తర కోస్తాకు లేదా దక్షిణ ఒడిశా తీరానికి చేరే అవకాశా లున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తుపాను ఒక మోస్తరుగా ఉంటుందన్నారు. హుదూద్ కంటే తీవ్రంగా దీని ప్రభావం ఉంటుం దన్నదాంట్లో నిజం లేదని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. ఉత్తరదిశగా ఈ గాలుల తీవ్రత ఉందన్నారు. ఇప్పటికే సముద్రం పై ఉన్న మత్స్యకారులు వెనక్కి వచ్చేయాలన్న ఆదేశాలు జారీచేశామని తెలిపారు.
సామాజిక మాద్యమాల్లో అలజడి
విశాఖనగరం వైపు అల్పపీడనం దూసుకొస్తున్న దని 18, 19, 20 తేదీల్లో విశాఖపట్నం ప్రాంతం తీవ్ర తుపాను తాకిడికి గురి కాబోతుందని సామాజిక మాద్యమాల్లో ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయని గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై వాస్తవం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తీరమంతా అప్రమత్తం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని తీరప్రాంతమైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులతో సమావేశమై తీరంలో సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ఆదేశించారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని విఆర్ఒలకు సూచించారు. తుపాను తీరం దాటే వరకూ వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను హెచ్చరికలతో మత్స్యకారులు బోట్లను లంగర్లు వేసి జాగ్రత్త పరిచారు.