Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధర పెంచేదెన్నడు..
- మోడీ సర్కారుపై పోరుకు రైతాంగం సై
- నేటి నుంచి ఢిల్లీలో 'కిసాన్ ముక్తి సంసద్'
- లక్షలాదిగా తరలిరానున్న దేశ రైతన్న...
దేశానికి అన్నం పెట్టే రైతన్న... కేంద్రంలోని మోడీ సర్కారుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యాడు. మూడున్నరేండ్ల క్రితం రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించేందుకు ఢిల్లీ బాట పట్టాడు. ఒకరికాదు ఇద్దరు కాదు.. లక్షలాది మంది రైతులు దేశ రాజధాని హస్తినకు బయల్దేరారు. తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని, రైతుల రుణాలన్నీ ఏకమొత్తంలో మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం (సోమ,మంగళవారాలు) రెండు రోజుల పాటు పార్లమెంట్ స్ట్రీట్లో 'కిసాన్ ముక్తి సంసద్' నిర్వహిస్తున్నారు. దేశ కార్మికలోకం నిర్వహించిన చారిత్రాత్మక 'మహాపడావ్' చోటే తమ బాణీ వినిపించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
రైతులకు 'మంచిరోజులు' తీసుకొస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. ఈ మూడున్నరేండ్ల కాలంలో దేశ రైతాంగాన్ని విస్మరించింది. పంటసాగుకు అయ్యే ఖర్చుపై 50 శాతం లాభంతో కనీస మద్దతు ధర తీసుకొస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ హామీనిచ్చింది. కానీ అధికారం చేపట్టిన తరువాత ఆ హామీలన్నీ విస్మరించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లోనూ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం సాధ్యం కాదని వెల్లడించింది. ఒకవైపు ఇన్ఫుట్ సబ్సిడీ పెరగడం మరోవైపు రైతులు పండించిన పంటకు కనీసమద్దతు ధర దక్కకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అటు కేంద్రంలోనూ, మెజార్టీ రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ సర్కార్ల హయా ంలో 62 శాతం ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. గత పదేండ్ల కాలంలో దేశ పంట ఉత్పత్తి(ఆహార ధాన్యాలు, కూరగాయలు) 365 మిలియన్ టన్నుల (2005-06) నుంచి 534 మిలియన్ టన్నులకు(2015-16) పెరిగింది. అదే సమయంలో రైతు సంఘాల కథనం ప్రకారం సుమారు 1,50,000 మంది రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి అంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. వీటికితోడు పంటసాగుకు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం రైతుల పాలిట శాపంగా మారుతోంది.ఎన్ఎస్ఎస్ఓ సర్వే నివేదిక ప్రకారం దేశంలోని రైతు రుణాల వాటా 25.9 శాతం(1992) నుంచి 45.9 శాతానికి(2013) పెరిగింది. ఇందులో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి అత్యధిక వడ్డీకి తీసుకున్న రుణాలు 40 శాతం. ఇంతటి ప్రతికూల సమయంలో రైతాంగానికి అండగా నిలవాల్సిన మోడీ సర్కారు.. రైతాంగ వ్యతిరేక విధానాలు చేపట్టింది. గోదుమలపై దిగుమతి సుంకాన్ని ఎత్తేసింది. ఇక నోట్లరద్దు దేశ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
బీజేపీ సర్కారు విధానాలపై నిరసన తెలిపితే మధ్యప్రదేశ్లోని మందసోర్లో కాల్పులు జరిపి ఆరుగురు రైతులను బలి తీసుకున్నారు. ఇక మోడీ సర్కారు తీసుకొచ్చిన పంట రుణ మాఫీ సైతం ప్రయివేటు కంపెనీల జేబులు నింపేందుకే దోహదపడింది. ఈ నేపథ్యంలో దేశంలోని సుమారు 184 రైతు సంఘాలు 'అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఎఐకెఎస్సీసీ)గా ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా కిసాన్ముక్తి యాత్ర నిర్వహించాయి. దక్షిణ, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతదేశ వ్యాప్తంగా నాలుగు జాతాలు చేపట్టాయి. ఈ నాలుగు జాతాలు సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఏకమవనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించనున్న 'కిసాన్ ముక్తి సంసాద్'లో లక్షలాది మంది రైతులు పాల్గొంటున్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు పెద్దఎత్తున పాల్గొంటున్నాయి.