Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔను నిజమే : యూఐడీఏఐ వెల్లడి
- 210 వెబ్సైట్లలో ఆధార్ సంఖ్యతో సహా వ్యక్తిగత వివరాలు బహిర్గతం
వ్యక్తిగత గోప్యతకు 'ఆధార్' ప్రమాదం తెచ్చిపెడుతుందని సామాన్యుడి నుంచి సుప్రీంకోర్టు వరకూ అనుమానం, ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడవి నిజమయ్యే పరిస్థితి వచ్చింది. ఆధార్ డాటా నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయన్న విషయం బయటపడింది. ఇప్పటిదాకా ఆధార్కు భద్రత ఉన్నదని సుప్రీంకోర్టు ముందు బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు కాస్తా నీటి మూటలయ్యాయి.
న్యూఢిల్లీ : కొందరు లబ్దిదారుల పేర్లు, వివరాలను ఆధార్ సంఖ్య సహితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్సైట్లలో బహిరంగంగా ప్రదర్శించారని 'యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (యూఐడీఏఐ) స్వయంగా వెల్లడించింది. నిబంధనల ఉల్లంఘన జరిగి ఆధార్ డాటా ప్రయివేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వాస్తవాన్ని యూఐడీఏఐ ఒప్పుకుంది. దీంతో ఆధార్ కలిగి ఉన్న జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి ప్రదర్శించిన ఆ సమాచారాన్ని వెబ్సైట్ల నుంచి పూర్తిగా తొలగించినట్టు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు యూఐడీఏఐ సమాధా నమిచ్చింది. కాగా ఉల్లంఘన ఎప్పడు జరిగిందో, ఎప్పుడు సమాచారాన్ని తొలగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పన్నెండు అంకెల ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ జారీ చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు పొందాలంటే లబ్ది దారులకు ఆధార్ను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండటం లేదని, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కొనసాగుతోంది. మరోవైపు తమ వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం గోప్యంగా, సమగ్రంగా, భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెప్పింది. వ్యక్తుల వివరాలు ప్రదర్శించకుండా ఉండేలా కఠినమైన నిబంధనలు ఉన్నాయని కూడా తెలిపింది. అయితే యూఐడీఏఐ చెబుతున్నదానికి బయట జరుగుతున్నదానికి పొంతన ఉండటం లేదనేలా లొసుగులు వెలుగుచూస్తున్నాయి . ఆధార్ డాటా ప్రయివేట్ వ్యక్తుల, సంస్థల చేతుల్లోకి వెళ్లిందనే ఉదంతాలు తరుచూ బయటపడుతున్నాయి.
వ్యక్తిగత గోప్యతకు ముప్పు
ఒక్క క్లిక్తో ఆధార్లో ఉన్న సమాచారం అంతా ఇట్టే బయటపడిపోతోంది.కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి దేశప్రజలంతా తమ వివరాలన్నీ ఆధార్ రూపంలో అప్పగించారు. ఆధార్ డేటా కనుక ప్రభుత్వం వద్ద ఉంటే..తమకు ఎలాంటి ఇబ్బందులు రావనుకుని భావించారు. ప్రజాప్రయోజనాలకు మాత్రమే ఆధార్ ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ డేటా అంతా ప్రయివేటు వ్యక్తులు,సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందని యూఐడీఏఐ స్వయంగా వెల్లడించటంతో..పౌరుల హక్కు కొల్లగొట్టడమేనని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తిగోప్యత భద్రతకు ఆధార్ అని నమ్మబలికిన కేంద్రం చేతులెత్తేసింది. ఇక యూఐడీఏఐ కూడా కొద్దిమందిపై వేటు వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆర్టీఐలో స్పష్టమైంది. ఇంకోవైపు ఆధార్ లింకుతో..తమకు వ్యక్తిగతమైన కీలకమైన అంశాలకు భద్రత గాల్లో దీపంలా మారిందనే చర్చ మొదలైంది.