Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో ఎడతెగని ఉత్కంఠ..!
- ఆసక్తిగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు..!!
నవతెలంగాణ డెస్క్ : దేశ ప్రజలంతా గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోడీకి గుజరాత్ సొంత రాష్ట్రం కావడం, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ ఇటీవలే బాధ్యతలు స్వీకరించడంతో ఇద్దరికీ ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. 22 ఏండ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో కొనసాగగా, హిమాచల్ప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది.
గుజరాత్లో ఈ నెల 9,14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. రెండుదశల్లో మొత్తం 182 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. గుజరాత్లో మొత్తం 4 కోట్ల 35 లక్షలమంది ఓటర్లుండగా, 2 కోట్ల 97 లక్షలమంది(68.41 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. 33 జిల్లాల్లోని 37 కేంద్రాల్లో ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. హిమాచల్ప్రదేశ్లోని మొత్తం 68 స్థానాలకు నవంబర్ 9న పోలింగ్ నిర్వహించారు. ఈ రాష్ట్రంలో 75.28 శాతం ఓటింగ్ నమోదైంది. 42 కౌంటింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాగా, ఆ అంచనాలన్నీ బూటకమని కాంగ్రెస్ నేతలు కొట్టి వేశారు. రెండు రాష్ట్రాల్లోనూ తామే అధికారం చేపడ్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కే తిరిగి అవకాశమిస్తామని రాహుల్గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఓవేళ బీజేపీకి మెజారిటీ వస్తే ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రేమ్కుమార్ ధుమాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.