Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుంది..ముసళ్ల పండుగ ?
- ప.బెంగాల్లో వామపక్ష రికార్డును అందుకోవటంపై ఆశలు
న్యూఢిల్లీ : రకరకాల ఎన్నికల గిమ్మిక్కులు, దేశ ప్రధాని సైతం ఓట్ల కోసం దిగజారిన వైనం...గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ప్రజలంతా చూశారు. 150 స్థానాల్ని కైవసం చేసుకొని వరుసగా ఆరోసారి రికార్డులు బద్దలు కొడుతున్నామని...బీజేపీ అధినాయకత్వం చెప్పుకుంది. తీరా ఓటరు తీర్పు చూశాక బీజేపీకి చావుతప్పి... కన్నులొట్టబోయినంత పనైంది. స్వంత రాష్ట్ర ప్రజల నుంచే అమిత్ షా, మోడీలకు గట్టి షాక్ ఎదురైంది. ఇదంతా పక్కనబడేసి...వరుసగా ఆరోసారి గెలిచామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాల 34 ఏండ్ల సుదీర్ఘ పాలనతో బీజేపీ తన గుజరాత్ పాలనను పోల్చుకుంటోంది. కానీ ముందు ముందు ఇంటా(గుజరాత్), బయటా అలాంటి సాను కూలత బీజేపీకి లేవని ఓటరు చెప్పకనే చెప్పాడు.
పశ్చిమ బెంగాల్లో 34 ఏండ్ల సుదీర్ఘ పాలన
పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి 34 ఏండ్లపాటు సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. 1977 జనవరిలో సీపీఐ(ఎం), ఆల్ ఇండియా ఫార్వార్డ్బ్లాక్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఫార్వర్డ్బ్లాక్, రివాల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా...తదితర పార్టీలు కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. 1977 జూన్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పోటీ చేసి ఘనవిజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ కూటమి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు అంసెబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జ్యోతిబసు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించగా.. మరో రెండు సార్లు బుద్ధదేవ్ భట్టాఛార్య సీఎంగా పనిచేశారు. 34ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓటమిపాలైంది.
గుజరాత్లో బీజేపీ ఆరోసారి..
ప.బెంగాల్లో వామపక్షాల పాలనతో బీజేపీ గుజరాత్ పాలనను పోల్చలేం. బెంగాల్లో భూ సంస్కరణలతోపాటు, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషి జరిగింది. అదే గుజరాత్ విషయానికొస్తే...ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఇది వామపక్ష పార్టీల నాయకులు చెబుతున్న మాట కాదు. గుజరాత్ ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్, దళిత యువ నేత జిగేష్ మేవాని, పాటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్లు చెబుతున్న మాట. గుజరాత్ 22 ఏండ్ల పాలనను వారు ఎండగడుతున్నారు. ఇక్కడేదో జరిగిందని చెబుతున్న 'గుజరాత్ అభివృద్ధి మోడల్' అంతా 'హంబక్' అని రుజువులతో సహా చూపుతున్నారు.
ఏది ఎలా ఉన్నా...ఎన్నికల పోరులో మాత్రం బీజేపీ వరుసగా ఆరోమారు అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే 22ఏండ్లపాటు అధికార పీఠంలో బీజేపీ కొనసాగింది. మరో ఐదేండ్లపాటు పాటు రాష్ట్రాన్ని పాలించనుంది. 2022 చివరినాటికి రాష్ట్రంలో బీజేపీ పాలన 27 ఏండ్లకు చేరుకుంటుంది.
రాష్ట్రంలో 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తొలిసారిగా విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో భాజపాకు 121 సీట్లు వచ్చాయి. 1998 తర్వాత నరేంద్రమోడీ ముఖ్యమంత్రి అయ్యాక, రాష్ట్రంలో హిందూత్వ రాజకీయాలు ఉధృతమయ్యాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మెజార్టీ 117 స్థానాలకు తగ్గింది. కాంగ్రెస్ పుంజుకొని 59 స్థానాల్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఐదేండ్లకు 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 116 సీట్లు వచ్చాయి. 2017 ఎన్నికల నాటికి ప్రజాక్షేత్రంలో బీజేపీ బలం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతానికైతే మ్యాజిక్ ఫిగర్కు (92 స్థానాలు)కు అటూఇటుగా 99 స్థానాలతో తృప్తి చెందింది.