Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల బాగోగులను గాలికొదిలేసిన 52% కంపెనీలు
- వెల్ నెస్ కార్యక్రమాలకు పలు సంస్థలు తిలోదకాలు
- ఉద్యోగుల గైర్హాజరు ఒక్క శాతం తగ్గించినా.. 128వేల కోట్లు లాభమే!
- ఉద్యోగి శారీరక, మానసిక ఆరోగ్యం.. సంస్థ ప్రగతికి కీలకం: నిపుణులు
- అసోచాం అధ్యయనంలో వెల్లడి
వృత్తి - జీవితం ఈ రెండూ నేటి ఆధునిక ప్రపంచంలో మనిషికి రెండు కండ్లు లాంటివని చెప్పొచ్చు. వీటిలో ఏ ఒక్కటి పరిపూర్ణం కాకపోయినా.. మనిషి కుంగిపోవడం ఖాయం! అందుకే, వర్క్- లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం ప్రస్తుతం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఐతే, వ ృత్తే జీవితంగా భావిస్తూ.. సంస్థల ఉన్నతికి పాటుపడుతోన్న ఉద్యోగుల బాగోగులను కొన్ని కంపెనీలు అస్సలు పట్టించుకోవట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంపై నవతెలంగాణప్రత్యేక కథనం..
* కడవేర్గు
ప్రపంచ దేశాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఐటీ, కస్టమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసులు, రియల్ ఎస్టేట్, నిర్మాణం - మౌలిక సదుపాయాలు, మార్కెట్ రీసెర్చ్, మీడియా, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యపరమైన సమస్యలను ( మానసిక, శారీరక ) అంచనా వేసి తగిన చికిత్సలను సూచించే 'వెల్ నెస్ ప్రోగ్రాం'లను చేపట్టడంలో కొన్ని సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అసోచాం తాజా సర్వేలో వెల్లడైంది.
వారి 1శాతం గైర్హాజరు విలువ.. 128వేల కోట్లు
''కార్పొరేట్ వెల్ నెస్ ప్రోగ్రాం బెనిఫిట్స్ టు ఆర్గనైజేషన్ అండ్ ఎకానమీ'' పేరుతో అసోచాం సంస్థ దేశంలోని ప్రధాన కార్పొరేట్ కంపెనీల్లో చేపట్టిన తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. ఇక అధ్యయనం ప్రకారం.. తాము పనిచేస్తోన్న సంస్థలు ఎటువంటి 'వెల్ నెస్' కార్యక్రమాలను నడపడం లేదని సర్వేలో పాల్గొన్న సుమారు 52శాతం ఉద్యోగులు తెలిపారు. తమ సంస్థలు నడుపుతోన్న వెల్ నెస్ ప్రోగ్రాం లు అంతగా బాగోలేవని, వాటిని అభివృద్ధి చేసే అవసరం ఎంతైనా ఉన్నదని వెల్ నెస్ ప్రోగ్రాం లను నడిపే కంపెనీల్లో పనిచేసే దాదాపు 62శాతం ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కాగా, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల గైర్హాజరును వెల్ నెస్ ప్రోగ్రామ్ లను ఉపయోగించి కనీసం 1శాతం తగ్గించినా.. 2018లోపు సుమారు 128వేల కోట్ల రూపాయలు ఆదా చేసినట్టేనని, వెల్ నెస్ ప్రోగ్రామ్ కి సంస్థ ఖర్చు చేసే ఒక్క రూపాయి.. ఉద్యోగి గైర్హాజరు సమయంలో యాజమానులు సగటున నష్టపోయే రూ.132.33 ( ఒక్కో ఉద్యోగిపై) ఆదా చేస్తుందని, అలాగే, ఆరోగ్య సంరక్షణకు ఉద్యోగులు సగటున ఖర్చుచేసే మొత్తంలో సుమారు 6.62 రూపాయలు .. వెల్ నెస్ ప్రోగ్రాం ల వల్ల తగ్గుతాయని అధ్యయనం పేర్కొంది.
వెల్ నెస్ ప్రోగ్రాం లు అవసరమే!:
ఏ సంస్థ అయినా విజయం సాధించి, లాభాల బాటలో నడవాలంటే ఉద్యోగులదే ప్రధాన భూమిక అని ఒప్పుకోవాల్సిందే! అలాంటి ఉద్యోగులు ఆరోగ్యపరమైన సమస్యలతో( మానసికంగా లేదా శారీరకంగా) బాధపడితే, అది వారి పనితీరు, తద్వారా సంస్థ వృద్ధి, ఆదాయంపై ప్రభావం చూపిస్తుందని తేలింది. ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా లేని ఉద్యోగుల్లో పని చేసే ఉత్సాహం ఉండకపోగా, వారి పనితీరులో క్రమంగా మార్పులు రావడంతో పాటు తోటి ఉద్యోగులపై కూడా ప్రభావం చూపే అవకాశమున్నదని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. నేటి పోటీ ప్రపంచంలో సంస్థల మధ్య ఒకరకమైన పరోక్ష యుద్ధం నడవడం.. అది ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మానసిక, శారీరక శ్రమను పెంచేదిగా మారుతుండటం పరిపాటిగా తయారయ్యింది. కొంతమంది ఉద్యోగులు శారీరకంగా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే అలవాటు ఉన్నప్పటికీ.. మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇటువంటి వారి కోసమే.. ఆయా సంస్థల్లో మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో వెల్ నెస్ ప్రోగ్రాం లను నిర్వహించడం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాల్లో పనిఒత్తిడిని తట్టుకునేందుకు ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని కల్పించడంతో పాటు శారీరక సమస్యలను సైతం దూరం చెయ్యడమే లక్ష్యంగా ఉండేది. ఐతే, క్రమేపీ వివిధ సంస్థలు వెల్ నెస్ ప్రోగ్రాం లకు మంగళం పాడటం వల్ల ఉద్యోగుల్లో ఒకరకమైన ఒత్తిడి మళ్ళీ కనిపిస్తున్నదని, ఇది ఇలాగే కొనసాగితే, ఆయా సంస్థల ఆర్ధిక ప్రగతిపై పెను ప్రభావం చూపే అవకాశమున్నది. ఇకనైనా, సదరు సంస్థలు ఉద్యోగులు పని ప్రాంతాల్లో ఎదురుకుంటున్న మానసిక, శారీరక సమస్యలను దూరం చేసే మార్గాలను అన్వేషిస్తూ.. పరిష్కార కార్యక్రమాలను తక్షణం అమలు చేసే అవసరం ఎంతైనా ఉన్నదని మానవ వనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'వెల్ నెస్ ప్రోగ్రామ్స్'కు ఉద్యోగులు ఎందుకు హాజరవుతున్నారంటే?
రంగం ఆరోగ్యకరమైన కంపెనీ కాబట్టి రెండూ
జీవితం కోసం ప్రోత్సాహకం
ఇంజినీరింగ్ 75 19 06
కస్టమర్ గూడ్స్ 75 13 12
ఫైనాన్షియల్ సర్వీసులు 73 27 -
ఐటీ 55 34 11
మార్కెట్ రీసెర్చ్ 90 10 -
మీడియా 70 30 -
ఆధారం: అసోచాం సర్వే