Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఫిబ్రవరి 10వ తేదీన పాలస్తీనా పర్యటనకు వెళ్లనున్నారని దౌత్యవర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి రెండో వారంలో పాలస్తీనా రాజధాని రమల్లాకు చేరుకోనున్న మోడీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్తో భేటీ అవుతారని ఈ వర్గాలు వివరించాయి. భారత ప్రధాని ఒకరు పాలస్తీనా రాజధాని రమల్లాను సందర్శించటం ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటన చివరిదశలో మోడీ పాలస్తీనా పర్యటన ఖరారు కావటం గమనార్హం. సంప్రదాయకంగా పాలస్తీనాను సమర్థిస్తున్న భారత్ వైఖరిని ప్రధాని మోడీ పర్యటన గట్టిగా సమర్థిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జెరూసలేం నగరంపై అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్ ఐరాసలో ఓటు వేయటాన్ని పాలస్తీనా ప్రశంసించిన విషయం తెలిసిందే. పాలస్తీనాతో పాటు ప్రధాని మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమన్ దేశాలలో కూడా పర్యటించనున్నారని, ఎమిరేట్స్లో ఆయన ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారని ఈ వర్గాలు వివరించాయి.