Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అనుమానాదస్పద స్థితిలో మృతిచెందిన సీబీఐ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. దీపక్ మిశ్ర నేతృత్వంలోని జస్టిస్ ఎ.ఎం. కన్వీల్కర్, డివై చంద్రచూడ్ల కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారిస్తుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు విషయంపై ఇటీవల నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోరు, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ రెండు పిటిషన్లు దాఖలుకాగా, కేసు విచారణను సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా అరుణ్ మిశ్రకు కేటాయించడంపై వివాదం నెలకొంది. ఈ వివాదాల నేపథ్యంలో లోయా కేసును ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. న్యాయమూర్తి లోయా (48) నాగ్పూర్లో 2014 డిసెంబరులో మృతిచెందారు. 2005లో సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్కు సంబంధించి బీజేపీ చీఫ్ అమిత్షా నిందితుడుగా ఉన్న కేసును విచారణ జరుపుతున్న లోయా అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. లోయా మృతిచెందిన కొద్ది వారాలకే ఆ కేసు నుంచి అమిత్షా బయటపడటం గమనార్హం.