Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 ఏండ్ల క్రితం 4 కోట్లు
- 20 వేలకు పడిపోయిన సంఖ్య
- మనుషులకు ఎంతో మేలు చేసే డేగలు..!
- సహజ పారిశుధ్య కార్మికులు..!!
ఒకప్పుడు ఆకాశంలో వందల మీటర్ల ఎత్తున ఎగురుతూ పక్షి విమానాల్లా గుంపులుగా తిరిగే గద్దలు..ఇప్పుడిక కనుమరుగు కానున్నాయా..? పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చెట్లపైనా, ఇండ్లపైనా, కరెంట్ స్తంభాలపైనా..ఎక్కడంటే అక్కడ కనిపించిన గద్దలదిక గత చరిత్రేనా..? ఓవేళ ఎక్కడైనా కనిపించినా అది ఓ అరుదైన అపురూప దృశ్యంగా మిగిలిపోనున్నదా..? రైతులు, పేదలు తమ ఇండ్లల్లో పెంచుకునే కోడి పిల్లలకు ఇక డేగల భయం లేదని సంతోషించాలా..? లేదంటే కాలధర్మం చెందిన మన ఆత్మబంధువుకు నిర్వహించే పెద్దకర్మ రోజున అన్నం ముట్టేందుకు రాబంధువు రాలేదని బాధ పడాలా..? తమ పొడవాటి ముక్కులతో ఊరి బయటా, రోడ్ల పక్కనా జంతువుల కళేబరాలను తింటూ ప్రకృతి పారిశుధ్య కార్మికులుగా వ్యవహరించిన గద్దల మనుగడ కనుమరుగైన కారణాలేమిటి..? ఆకాశంలో రాబందుల రెక్కల చప్పుడు మళ్లీ మనం వినాలంటే ఏం జరగాలి..?
నవతెలంగాణ జనరల్డెస్క్
డేగ,రాబందు, గద్ద..ఇవన్నీ ఒకే పక్షికి మనం పెట్టుకున్న పేర్లు. కానీ, గద్దల్లోనూ వాటి లక్షణాల్లో కొన్ని తేడాలను బట్టి జీవశాస్త్రవేత్తలు వాటిని జాతులుగా వర్గీకరించారు. భారత ఉపఖండంలో 8 జాతుల గద్దలను రాజస్థాన్లోని కేవలాదేవ్ నేషనల్ పార్క్ గుర్తించింది. 7 జాతులను రికార్డు చేసింది. పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డపుజాతి గద్దలను(గైపీటస్ బార్బాటస్) రికార్డు చేయలేకపోయింది.
1991-92లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాలో 4 కోట్ల గద్దలున్నట్టు అంచనా. అలాంటిది ఓ దశాబ్దం తర్వాత లెక్కేస్తే అవి అంత రించిపోయే దశకు చేరుకున్నట్టు తేలడంతో ప్రకృతి ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2007లో చేసిన సర్వేలో మూడు జాతుల(జిప్స్ ప్రజాతి) గద్దలు తమ ఉనికిని కోల్పోయే దశకు చేరుకున్నాయి. భారత్లోని జిప్స్ ఇండికస్(పెద్ద రెక్కల గద్దలు), జిప్స్ టెన్యూరోస్ట్రిస్(చిన్న రెక్కల గద్దలు) 97 శాతం కనుమరుగయ్యాయి. జిప్స్ బెంగాలెన్సిస్(తెల్ల రెక్క గద్దలు) 99.9శాతం ఉనికిని కోల్పోయాయి. ఇంత వేగంగా ఓ పక్షి జాతి అంతరిం చడం ప్రపంచంలో ఇప్పటివరకూ జరగలేదని బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మాజీ డైరెక్టర్ అసద్ రహ్మానీ తెలిపారు. ఒకప్పుడు ఈ భూమిపై 300కోట్ల సంఖ్యలో ఉన్నట్టు భావిస్తున్న పర్యాటక పావురం కనుమరుగైన దానికన్నా ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. అమెరికా ఓహివోలోని సిన్సిన్నాటీ జంతుశాలలో 1914, సెప్టెంబర్లో చివరి పర్యాటక పావురం మార్తా మృతి చెందిన ఘటనను ఆయన గుర్తు చేశారు.
రాబందులు అంతరించిపోవడాన్ని మొదటిసారిగా గుర్తించిన వ్యక్తి బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త విభూప్రకాశ్.. 1987-88లో రాజస్థాన్ భరత్పూర్లోని కేవలాదేవ్ నేషనల్ పార్క్లో 353 రాబందుల జంటలున్నట్టు ఆయన లెక్కించారు. 1996లో వెళ్లి చూస్తే వాటి సంఖ్య సగానికి తగ్గింది. చెట్లపైనా, గూళ్లలో, పొదల మధ్య చచ్చి పడి ఉన్న రాబందులను చూసి ఆందోళన చెందినట్టు ఆయన తెలిపారు. 2000 సంవత్సరంలో వెళ్లి చూస్తే భరత్పూర్లోని పార్క్లో ఒక్క రాబందు కూడా కనిపించలేదని ఆయన తెలిపారు. ఒకప్పుడు భారత ఉపఖండంలో తెల్లరెక్క గద్దలు పెద్ద సంఖ్యలో కనిపించేవి. ఇప్పుడవి కనిపిస్తే ఓ అరుదైన దృశ్యమే. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న జిప్స్ ప్రజా తి గద్దలు తాజా అంచనా ప్రకారం 20,000 మాత్రమే మిగిలాయి. వీటి లో 12,000 పెద్ద రెక్క గద్దలు, 6000 తెల్లరెక్క గద్దలు, 1000 చిన్నరెక్క గద్దలు. ఈ మూడురకాల గద్దలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం 2000 సంవత్సరంలోనే హెచ్చ రించింది. తక్షణం వాట ిపునరుద్ధరణ కోసంచర్యలు చేపట్టాలని సూచించింది.
కారణాలేమిటి..?
దక్షిణాసియా ప్రాంతంలో డేగలు వేగంగా అంతరించిపోవడానికి స్పష్టమైన కారణాలను చెప్పలేకపోయినప్పటికీ కొన్నింటిని గుర్తించారు. కొందరు వాటిని వేటాడటం, అంటువ్యాధులు, వాటి ఆవాసాలు ధ్వసం కావడం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అయితే,వ్యవసాయ రంగం లో కొన్ని పురుగుల మందులను వాడటం వల్ల కూడా అవి అంతరిం చాయని జీవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1960 దశకంలో డీడీటీ వాడకం వల్ల అమెరికాలో గద్దలు పెద్దసంఖ్యలో మరణించిన సంఘటనను వారు గుర్తు చేశారు. పశువుల ఆరోగ్య రక్షణకు డైక్లోఫెనాక్ ఔషధాన్ని వాడటం కూడా ఓ కారణమని పాకిస్తాన్లో పరిశోధనలు జరిపిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. పశువుల కళేబరాలను తినడం ద్వారా ఆ ఔషధం డేగల శరీరాల్లో చేరి మూత్రపిండాలను దెబ్బతీయడం, కడుపులో పుండ్లు పడటానికి కారణమై అవి మృత్యువాత పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం తక్కువ ధరకు వస్తుండటంతో పశువుల పెంపకందారులు విరివిగా వినియోగించారని పరిశీలనలో తేలింది. దీంతో, పశువులకు ఈ డ్రగ్ వాడకంపై పాకిస్థాన్తోపాటు భారత్, నేపాల్లో నిషేధం విధించారు. గ్రామ పొలిమేరల్లో, పట్టణాల పరిసరాల్లో పడవేసే జంతువుల కళేబరాలను తినడం ద్వారా పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ రాబందులు ఎంతో మేలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబందుల గుంపు కేవలం 20 నిమిషాల్లోనే ఓ భారీ జంతువు కళేబరాన్ని బొక్కలు మినహా ఏమీలేకుండా తినేయగలవని వారు తెలిపారు. రాబందులు తమ శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రత, జీర్ణక్రియలో ఏర్పడే శక్తివంతమైన రసాయనాల వల్ల జంతువుల మృత శరీరాల్లో వృద్ధి చెందే ఆంత్రాక్స్్లాంటి ప్రమాదకర బ్యాక్టీరియాను సైతం చంపేసే రోగ నిరోధకత కలిగి ఉంటాయని వారు తెలిపారు. దీంతో, మనుషులకు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రకృతిసిద్ధంగా రాబందులు సహాయకారి పాత్ర పోషించాయని వారు విశ్లేషించారు. రాబందులు చేసే పని ఎలుకలు, కుక్కలు కూడా చేస్తాయి. కానీ, రాబందులంత వేగంగా జంతువుల మృత శరీరాలను అవి తినలేవు. అంతేగాక అవి తమ ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియాను మనుషులకు వ్యాపింపజేస్తాయి. ప్రమాదకర బ్యాక్టీరియాను అంతమొందించే రోగనిరోధకత ఎలుకలు, కుక్కల్లో తక్కువ. దీంతో, వీటి వల్ల మనుషులకూ ప్రమాదమే. రాబందులు అంతరించే దశకు చేరుకోవడంతో కుక్కల సంఖ్య పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ కాలంలో ఓ అంచనా ప్రకారం కుక్కల సంఖ్య 55 లక్షలమేర పెరిగింది. రాజస్థాన్లోని బికనేర్లోని జోర్బీర్ అనే చోట రాబందులు అంతరించకముందు 100 కుక్కలుండగా ఇప్పుడక్కడ వాటి సంఖ్య 1200కు పెరిగినట్టు ప్రకాశ్ తెలిపారు. అయితే, కుక్కల సంఖ్య అధికమవడం వల్ల వాటి కాటుకు గురై ప్రాణాంతక ర్యాబిస్ వ్యాధి బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 1992 నుంచి 2006 వరకు భారత్లో కుక్క కాటుకు గురైన 3 కోట్ల 85 లక్షలమందిలో 47,300మంది ర్యాబిస్తో చనిపోయారు. అంటే..డేగలు అంతరించడం వల్ల మనుషుల ప్రాణాలకూ ముప్పేనన్నది అర్థమవుతోంది.
రాబందుతో ఆత్మ బంధం
మరోవైపు సంప్రదాయికంగానూ రాబందులతో పలు మతాల వారికి ఆత్మీయ బంధం ఉన్నది. హిందువుల్లో ఎవరైనా చనిపోయిన పుడు నిర్వహించే పెద్దకర్మ రోజున గద్దలకు ఆహారం పెట్టడం ఆనవాయితీ. పక్షి ముడితేనే చనిపోయినవారికి ఆత్మశాంతి కలుగు తుందన్నది వారి నమ్మకం. పార్శీ మతస్థుల్లోనూ ఓ సంప్రదాయం ఉన్నది. తమ మతంలో ఎవరైనా చనిపోయినపుడు వారి మృత శరీ రాన్ని గద్దలకు ఆహారంగా ఇవ్వడం వారి సంప్రదాయం. ఇతర పద్ధ తుల్లో అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ప్రకృతి అపవిత్రమవు తుందన్నది వారి నమ్మకం. ప్రస్తుతం గద్దల అంతరింపు ఏడాదికి 43.9శాతం చొప్పున జరుగుతున్నట్టు అంచనా. ఇప్పుడు గట్టిగా పూనుకున్నా వాటి పునరుత్పత్తిని పెంచడం అంత తేలికైందేమీ కాదు. ఎందుకంటే రాబందుల్లో పునరుత్పత్తి రేట్ సహజంగానే తక్కువ. ఓ పునరుత్పత్తి కాలానికి ఒక గుడ్డు మాత్రమే ఓ రాబందు పెడుతుంది. గుడ్డును పొదిగే కాలం 8నెలలు. ఇప్పుడు అందుబా టులో ఉన్న గద్దలను కాపాడుకుంటే ఏడాదికి 5 శాతం చొప్పున వాటిని వృద్ధి చేసే అవకాశముంటుందని జీవ శాస్త్రవేత్తల అంచనా.
ఊరట కలిగించే సర్వే
2017 డిసెంబర్లో కేంబ్రిడ్జి జర్నల్లో ప్రచురితమైన ఓ సర్వే కాస్త ఊరట కలిగించేలా ఉన్నది. 2006లో భారత్లో పశువుల ఔషధం డైక్లోఫెనాక్ను నిషేధించిన తర్వాత గద్దల(తెల్ల రెక్కల గద్దలు, ఆల్బీట్ రకం గద్దలు) అంతరింపు బాగా నెమ్మదించినట్టు సర్వే వెల్లడించింది. పాకిస్థాన్, నేపాల్లోనూ సత్ఫలితాలు నమో దైనట్టు తెలుస్తోంది. 2004 నుంచి రాబందుల పునరుద్ధరణ కోసం ఈ మూడు దేశాల్లో చేపట్టిన చర్యలు కూడా ఫలితాలనిచ్చినట్టు సర్వే నివేదిక పేర్కొన్నది. హర్యానాలోని పినజోర్లో ఉన్న జఠాయు పునరుత్పాదక కేంద్రంలాంటివి దేశంలో ఎనిమిదింటిని ఏర్పాటు చేయాలని బోంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, హర్యానా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయించాయి. అంతరింపునకు గురైన మూడు జాతులకు చెందిన 162 రాబందుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. వీటి పెంపకా నికి ఉపయోగిస్తున్న వన్యమృగ సంరక్షణ కేంద్రాల పరిసర ప్రాంతాల ప్రజల్లోనూ అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎటూ 100 చ.కి.మీ. ప్రాంతాన్ని రాబందుల పెంపకం కోసం సేఫ్జోన్లుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాబందులకు ప్రమాదకరంగా భావిస్తున్న డైక్లోఫెనాక్ వాడకం ఘననీయంగా తగ్గినట్టు సర్వే నివేదికలో వెల్లడైంది. నిషేధానికి ముందు పశువుల కళేబరాల్లో ఈ ఔషధం 10 శాతం ఉండగా, 2013లో 2 శాతానికి పడిపోయింది. రాజస్థాన్లో మాత్రం ఇంకా 5 శాతం ఉన్నట్టు 2017లో నిర్వహించిన ఔషధ సర్వేలో వెల్లడైంది. అక్కడ మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉన్నది. అస్సాం ఈ డ్రగ్ వాడకాన్ని పూర్తిగా మానేసే దశకు చేరుకున్నది. అయితే, మనుషుల్లో ఈ డ్రగ్ వాడకంపై నిషేధం లేదు. దాంతో,మనుషులకు వాడే ఈ ఔషధాన్ని పశువులకు ఉపయోగించకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.
రాబందుల వల్ల మనుషులకు ఎన్నో ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నందున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా, సమాజంపైనా ఉన్నది. ఆకాశంలో వందల మీటర్ల ఎత్తున ఎగురుతూ నేలపై తనకు కావాల్సిన ఆహారాన్ని గుర్తించగల శక్తి(కంటి చూపు) రాబందులకున్నది. అందుకే దూరదృష్టితో ఆలోచించేవారిని ఉద్దేశిస్తూ డేగ చూపు అంటూ కితాబిస్తాం. మునుపటిలాగే డేగల గుంపుల్ని ఆకాశంలో చూడాలంటే మనమిపుడు అంతే దూర దృష్టితో వ్యవహరించాల్సి ఉన్నది.