Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్స్లను నిర్ణయించడానికి శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై మీ వైఖరేంటని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేయాలంటూ వారం రోజుల గడువు ఇచ్చింది. ప్రస్తుతం వారి జీతాలను వారే నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో.. వారి జీతాల పెంపుకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు విషయమై ఓ ఎన్జీవో దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, సంజరు కిషన్ కౌల్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కాగా, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందనీ, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తెలిపింది. 'భారత ప్రభుత్వ విధానం క్రియాశీలకమైనది...దాన్ని ప్రతిరోజూ మార్చలేరని' కేంద్రానికి చురకలంటించింది. అసలు దీనిపై ప్రభుత్వం వ్యూహమేంటి? శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా?' అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 'దీనిపై మీకెలాంటి స్పష్టత లేకపోవచ్చు...కానీ మీకిదే చివరి అవకాశం' అని కోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు వారి జీతాలను వారే ఎలా పెంచుకుంటారంటూ ఎన్జీవో తరఫు న్యాయవాది ఎస్ఎన్ శుక్లా తన వాదనను వినిపించారు. 11 ఏండ్ల క్రితం లోక్సభ స్పీకర్ అన్ని పార్టీలను సమావేశపరిచి ఎంపీల జీతబత్యాలు, అలవెన్సులు నిర్ణయించడం కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఏకపక్షంగా నిర్ణయించారంటూ కోర్టుకు తెలిపారు. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. లోక్ ప్రహరి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన కోర్టు ఎంపీలు వారి జీతాల్ని స్వయంగా నిర్ణయించలేరని వెల్లడిస్తూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.