Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాంగ్మార్చ్తో దిగొచ్చిన మహా సర్కార్
- రైతుల డిమాండ్లకు ఫడ్నవీస్ ప్రభుత్వం అంగీకారం
- ఆరు రోజులు.. 200 కిలోమీటర్లు పాదయాత్ర
- కాళ్లకు బొబ్బలెక్కినా వెనక్కి తగ్గని కర్షకులు
- ఫలించిన అలుపెరుగని పోరాటం
- ఆందోళన విరమించిన రైతులు
ఆత్మహత్యలు కాదు.ఆగ్రహించటమే ఏకైక మార్గమని అన్నదాత గుర్తించాడు. పోరుబాటనే ఎంచుకున్నాడు. ఆడ, మగా, ముసలీ ముతకా అన్న తేడాలేదు..కాళ్లు పగిలినా.. రక్తం కారినా.. రైతుల పట్టుదల మాత్రం సడలలేదు. నెత్తిన ఎర్రటి ఎండ చుర్రుమంటున్నా.. ఆరు రోజులపాటు..200 కిలోమీటర్లు ఏకధాటిన కాలినడకన కొనసాగించారు. పాలకుల నిర్ణయాలతో దిక్కుతోచని స్థితి నుంచి తాడోపేడో తేల్చుకుందామని రైతులు కదం తొక్కారు. కడుపుమండిన అన్నదాత ఆగ్రహంతో ముంబయినగరానికి చేరుకున్నారు.దీంతో మహానగరంలో ఎటు చూసినా రైతులే కనిపించారు. మొక్కవోని ధైర్యంతో కదిలిన శ్రామిక జీవులను స్థానిక జనం అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. ఆకలి తీర్చేందుకు చేతనైన సాయం చేశారు. దాహం తీర్చారు. అనుమతిలేదన్న పాలకుల ఘీంకారాలు..రైతన్న గుండె ధైర్యం ముందు తలవంచాయి. రైతులు పాలకుల మెడలు వంచారు. విజయం సాధించారు. బీజేపీ పాలకులు తోకముడిచారు. శాసనసభ ముట్టడికి రైతులు సమాయత్తమవు తుండగానే.. మహారాష్ట్ర పాలకులు దిగిరాకతప్పలేదు. రైతుల కోర్కెలు అంగీకరిస్తూ.. అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు.
ముంబయి : రైతుల సంక్షేమం పట్ల ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వేలాది మంది రైతులు ముంబయికి చేరు కోవడంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆగమే ఘాల మీద దిద్దుబాటు చర్యలను ప్రారం భించారు. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తా మని అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈనెల 6న నాసిక్లోని సీబీఎస్ చౌక్ వద్ద పాదయాత్ర ప్రారంభ మైంది. పాదయాత్రలో థానె, పాల్గఢ్ జిల్లాల రైతులు సైతం పాల్గొన్నారు. పూర్తి రుణమాఫీ, కరెంటు బిల్లుల రద్దు, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు అమలు, నదుల అనుసంధాన ప్రక్రియను ప్రక్షాళన చేసి గిరిజన గ్రామాలు మునిగిపోకుండా చూడ టం, అటవీ హక్కుల చట్టం-2006 అమలు సహా 20 డిమాండ్లను రైతులు.. ప్రభుత్వం ముందుంచారు. ఆరు రోజుల పాటు సాగిన లాంగ్ మార్చ్ సోమ వారం ఉదయం ముంబయిలోని ఆజాద్ మైదా న్కు చేరుకున్నది. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయినాగానీ సంకల్పం వీడని రైతులు అసెంబ్లీని ముట్టడించి తీరుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సోమవారం ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీకి ర్యాలీగా బయలు దేరనున్నట్టు సీపీఐ(ఎం) నేత అశోక్ దవ్లే వెల్లడించారు. ఈలోగా పాదయాత్ర అంశంపై అసెంబ్లీలో ఫడ్నవీస్ ప్రకటన చేశారు. రైతులు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అనంతరం అసెంబ్లీ భవనం వద్ద రైతు సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఈ మేరకు అన్నదాతలు తమ ఆందోళనను విరమించారు. రైతుల డిమాండ్లను పరిశీలించేందుకు ఫడ్నవీస్.. ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్, జల వనరుల శాఖ మంత్రి గిరిశ్ మహజన్, వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ్ పుండ్కర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావ్రీ, సహకార శాఖ మంత్రి సుభాశ్ దేశ్ముఖ్, పీడబ్ల్యూడీ మంత్రి ఏక్నాథ్ షిండే ఉన్నారు. అంతేకాక, అటవీ భూముల బదలాయింపు విషయంలో నెలకొన్న సమస్యలను ఆరు నెలల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. రైతులంతా సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.