Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ను కోరనున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడేందుకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని మోడీని కోరనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రణజిత్ సింగ్ రారు ఇక్కడ విలేకరులకు తెలిపారు.
మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిసి ఇదే ప్రతిపాదనలు చేయనున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని రారు చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,588.19 కోట్ల ఆర్థిక లోటును రాష్ట్రం ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడు రోజుల్లో సమగ్ర నివేదికను అందచేయాలని ఆర్థిక శాఖ అధికారులను కోరినట్లు చెప్పారు. ఈ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి మోడీతో భేటీ అవుతారని చెప్పారు.