Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు
నంద్యాల: సమాజాన్ని మార్చాలని, దేశానికి స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయస్సులోనే ఉరితాడును ముద్దాడి ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత అని సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు కొనియాడారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాల భగత్సింగ్ గ్రంథాలయం ఎదుట భగత్సింగ్ జాతీయ జనచైతన్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్సింగ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. జాతీయ అవార్డు గ్రహీత, అంకురం సినిమా డైరెక్టర్ ఉమామహేశ్వరారవు సుఖ్దేవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి రాజుగురు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లైబ్రరీ ట్రస్టుబోర్టు ఛైర్మన్ బి.శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. భగత్సింగ్ స్ఫూర్తితో సమాజాన్ని మార్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడేవారే విప్లవవీరులని, సోషలిజం, సమానత్వం కోసం, కుల విముక్తి కోసం ఆనాడు భగత్సింగ్ పోరాడారని గుర్తు చేశారు. అనంతరం పిఎ దేవి మాట్లాడుతూ ధనవంతులైన అంబానీ, విజయమాల్యా వంటి వారికి వేలకోట్ల రుణాలను ఎలాంటి షరతులూ లేకుండా ఇచ్చారని, అదే రైతులకు ఇచ్చే రుణాల్లో 50వేల రకాల నిబంధనలు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో యువతకు సందేశాత్మక సినిమాలు తీయడానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడ యువతను, ప్రజలను పెడదారి పట్టించే సినిమాలకే ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.