Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలుచేయాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ:ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పుపై వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. తమ తీర్పులో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఆదర్శ్ గోయెల్తో కూడిన ధర్మాసనం..కులం పేరుతో దళితులపై జరుగుతున్న వేధింపులు, దాడులను,సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని పొలిట్బ్యూరో విమర్శించింది. ముందస్తు బెయిల్ను నిరాకరించే నిబంధనలను తొలగించడం వల్ల ఈ చట్టం కింద నిందితులు అరెస్ట్ అయ్యే అవశాశం లేదని పొలిట్బ్యూరో తెలిపింది. ప్రాసిక్యూషన్కు ఉన్నతాధికారుల నుంచి అనుమతిని తప్పనిసరి చేస్తే ప్రభుత్వ అధికారులు విచారణ నుంచి తప్పించుకునేందుకు వీలు కల్పించినట్టేనని పొలిట్బ్యూరో స్పష్టం చేసింది. చట్టంలోని నిబంధనలకు నీరుగార్చకుండా కోర్టు ముందు అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు విఫలమయ్యారని పొలిట్బ్యూరో దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణా చర్యలు చేపట్టకపోతే సామాజిక సమానత్వం, న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులు దళితులపై మరింత హింసకు పాల్పడే అవకాశమున్నదని పొలిట్బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.