Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ నుంచి కేంద్ర మంత్రి జైట్లీ గెలుపు
- ప్రశాంతంగా ముగిసిన 'రాజ్యసభ' పోలింగ్..
- కేరళ స్థానం లెఫ్ట్ కూటమిదే..
న్యూఢిల్లీ : దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 26 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ శుక్రవారం సజావుగా ముగిసింది. 17 రాష్ట్రాల్లోని 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. 10 రాష్ట్రాల్లోని 26 సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మిగతా స్థానాలకు పోలింగ్ అనివార్యమైంది. మొత్తం 59 స్థానాల్లో బీజేపీ 28, కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించాయి. పోలింగ్ జరిగిన 33 స్థానాల్లో బీజేపీ 12, కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3, తృణమూల్ 4, ఎల్డీఎఫ్ 1, ఎస్పీ 1 గెలుచుకున్నాయి. ఈ ఎన్నికలతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పెరిగింది. కేరళలో ఒక రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగగా.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) అభ్యర్థి వీరేంద్రకుమార్ ఘన విజయం సాధించారు. కర్నాటకలో 4 స్థానాలకు బీజేపీ 1, కాంగ్రెస్ 3 సీట్లలో గెలుపొందాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 4, కాంగ్రెస్ 1, తెలంగాణలో టీఆర్ఎస్ 3, జార్ఖండ్లో కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్లో ఒక రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. యూపీలో మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ 1, బీజేపీ 9 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ గెలిచిన తొమ్మిదో స్థానానికి బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) గట్టి పోటీనిచ్చింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా.. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే.. క్రాస్ ఓటింగ్పై ఫిర్యాదులు రావడంతో ఉత్తరప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది.