Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమల ద్వారా 44 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు
తిరుపతి : భారతదేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ హబ్ను రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 44 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంపాళెంలో 'హీరో' మోటార్స్ పరిశ్రమకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీ హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలోకి రావడం గర్వకారణమన్నారు. 600 ఎకరాల్లో రూ.1,600 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2019 మార్చికల్లా ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో బైక్లు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్లో ఎలక్ట్రికల్ మోటార్ ఫీల్డ్కు డిమాండ్ ఉండబోతోందని, ఆ దిశగా హీరో యాజమాన్యం ఎలక్ట్రికల్ మోటార్లను తయారు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా రెండువేల మందికి, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. హీరో కంపెనీకి 69 వేల కోట్ల మార్కెటింగ్ సామర్థ్యం ఉందన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో విశాఖలో మూడు పారిశ్రామిక సదస్సులను నిర్వహించామని చెప్పారు. రూ.18.55 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో హీరో మోటార్స్, అపోలో, అశోక్ లేల్యాండ్, ఇసుజీ మోటార్స్ ఇప్పటికే భూమిపూజ పూర్తయ్యిందన్నారు కొత్తగా శ్రీసిటీలో హీరో పరిశ్రమకు భూమిపూజ జరిగిందన్నారు. అనంతపురంలో కియో మోటార్స్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు.