Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఆరంభానికి ముందే ఆట ముగిసిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'కర్నాటకకు కాషాయ రంగు అంటుకోదు. కానీ రంగులమయ కొనసాగుతుంది..' అని ప్రకాశ్రాజ్ ట్వీట్ చేశారు. అలాగే ప్రజల కోసం నిలబడతాను... పోరాటం కొనసాగుతుందన్నారు.
మోడీ రాజీనామా చేయాలి : అఖిలేష్ యాదవ్
కర్నాటక పరిణామలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ధన బలానికి బదులు ప్రతిక్షాలు విజయం సాధించాయి. ప్రతి ఒక్కరిని కొనాలనుకునేవారు ఈ పరిణామాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని ట్వీట్ చేశారు.
ప్రాంతీయ ఫ్రంట్ విజయం : మమతా బెనర్జీ
కర్నాటకలో మూడు రోజుల ముచ్చటైన యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానిస్తూ ఇది ప్రజాస్వామ్య, ప్రాంతీయ సమాఖ్య విజయమని వ్యాఖ్యానించారు. ''ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటకకు అభినందనలు. దేవేగౌడకు, కుమారస్వామికి, కాంగ్రెస్కు ఇతరులకు అభినందనలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
తప్పుడు మార్గాలు బహిర్గతమయ్యాయి : కేజ్రీవాల్
ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నం కర్నాటకలో విఫలమైందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అధికారం కోసం బీజేపీ అనుసరించిన తప్పుడు మార్గాలన్నీ బహిర్గతమయ్యాయి. ప్రజాస్వామ్యానికి రక్షణగా న్యాయవ్యవస్థ నిలిచింది. బీజేపీ దీని నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకుంటుందా..? అని ఆయన ప్రశ్నించారు.
2019లో బీజేపీ ముక్త్ కేంద్రం : తేజస్వి యాదవ్
పాట్నా: కర్నాటకలో చోటుచేసుకున్న పరిణామాలు.. 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్రం నుంచి బీజేపీని తొలగించేందుకు విపక్షాలకు ప్రోత్సాహాన్నిచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. కర్నాటకలో బీజేపీ ఓటమి దాని పతనానికి ఆరంభమని అన్నారు. 2019లో బీజేపీ ముక్త్ కేంద్రం ఏర్పడుతుందని చెప్పారు. దక్షిణ రాష్ట్రంలో విపక్షాల మధ్య బలమైన ఐక్యత కనిపించిందని.. బీజేపీకి 2019 ఎన్నికలు సులువేం కాదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అది తప్పకుండా ఓటమిని చవిచూస్తుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.