Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలు చెల్లించకపోతే జైలుకెళ్ళాల్సిందే : యూపీలో అన్నదాతలకు హెచ్చరికలు
- దిక్కుతోచని స్థితిలో రైతులు
లక్నో : బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ అయ్యాయని, వాటిని తిరిగి చెల్లించాల్సిన పనిలేదని సంతోషపడిన అన్నదాతల నెత్తిన మరో పిడుగు పడింది. రుణమాఫీ చేశామంటూ ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ సర్టిఫికెట్లు అందించింది. కానీ, తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలంటూ ఆగ్రా జిల్లాలో రైతులకు బ్యాంకులు రికవరీ నోటీసులు పంపడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రుణం ఎలా చెల్లించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. యోగి సర్కారు రుణమాఫీ చేసినట్టు మభ్యపెట్టిందా? లేక బ్యాంకులు కావాలనే ఇలా చేస్తున్నాయా? అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆగ్రాలోని రిథోరి గ్రామానికి చెందిన రైతు నేత్రపాల్సింగ్.. బ్యాంకులో తీసుకున్న రూ.57 వేల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. అదే ప్రాంతానికి చెందిన మరో రైతు రవీంద్రసింగ్.. తీసుకున్న రూ.49 వేల రుణం కూడా మాఫీ అయ్యింది. ఆగ్రా ఎంపీ సిహెచ్ బాబూలాల్, ఎమ్మెల్యే మహేశ్ గార్గ్ చేతుల మీదుగా రుణమాఫీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సైతం వారు అందుకున్నారు. కానీ, ఇప్పుడు వారిద్దరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి రికవరీ నోటీసులు రావడం చర్చాంశనీయంగా మారింది. జిల్లాలోని చాలా గ్రామాలకు చెందిన రైతులకూ బ్యాంకులు నోటీసులు పంపాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ బ్యాంకుల యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
రుణమాఫీని ప్రభుత్వం వెనక్కి తీసుకుందట..
రైతులకు పంపిన నోటీసుల్లో ఓ బ్యాంకు యాజమాన్యం చెప్పిన కారణం రైతులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టేసింది. రుణమాఫీ పథకాన్ని యోగి ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని సదరు బ్యాంకు పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియా సంస్థ... కగారోల్, అచ్నెరా, డిగ్రోటా, తదితర గ్రామాలకు చెందిన 50 మంది రైతులను సంప్రదించింది. వారందరికీ నోటీసులు వచ్చినట్టు మీడియా ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులందరూ జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించగా.. మేజిస్ట్రేట్ను కలవాలని చెప్పారు. దీంతో రైతులు.. ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. అధికార యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించి బ్యాంకులు నోటీసులు జారీ చేయకుండా చూడాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజీవ్కుమార్ మందార్ మాట్లాడుతూ.. రికవరీ నోటీసుల విషయమై రైతుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామని, దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ పథకం కింద 51,262 మంది రైతులు లబ్ది పొందారు. వీరిలో ఆగ్రా జిల్లాకు చెందిన వారు దాదాపు 16 వేల మంది ఉన్నారు.