Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని సుప్రంకోర్టు ఆదేశించింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఆమోదయోగ్యం కాదని స్పస్టంచేసింది. చట్టం ప్రకారం.. పని పూర్తయిన పక్షం రోజుల్లో ఒక కార్మికుడు లేదా కార్మికురాలు తన వేతనాన్ని పొందడానికి అర్హులని గుర్తుచేసింది. ఈ విషయంలో అధికార యంత్రాంగం ఒకవేళ విఫలమైతే, దానిని రాష్ట్ర ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చట్టం నిబంధనల భారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన యంత్రాంగాలు, కేంద్రం పై ఉన్నదని, దీనిని పరస్పరం తప్పించుకునే ప్రయత్నం చేయరాదని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, ఎన్.వి రమణలతో కూడిన ధర్మాసనం వివరించింది. కార్మికులకు వేతనాలు, పరిహారం చెల్లించడానికి తక్షణ కాలపరిమితి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ఈ చట్టం విషయంలో గతంలో కొన్ని ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.. ఇందులో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చి ప్రణాళికను మరింత సమర్థవంతంగా తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సూచించింది. చట్టంలో లోపాలను సవరించాలని ఆదేశించింది. కార్మికులకు చేసే చెల్లింపుల్లో కొంత పెరుగదల ఉన్నదన్న కేంద్రం వ్యాఖ్యల పై స్పందించిన న్యాయస్థానం.. అది వారికి చాలినంతగా లేదని వ్యాఖ్యానిస్తూ ఈ విషయంలో కేంద్రం తీరును తప్పుబట్టింది. స్వరాజ్ అభియాన్ ఎన్జీవో పిటిషనర్ లేవనెత్తిన ఇతర అంశాలపై కూడా ధర్మాసనం విచారించింది.