Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక వ్యవహారంలో కీలకమైన ఉత్తర్వులు
- న్యాయస్థానంలో అరుదైన ఘటనలు
- అర్థరాత్రి ఓసారి, సెలవురోజు మరోసారి విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ప్రజాస్వామ్య పునరుద్ధరణలో 'సుప్రీం' అని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి దేశ ప్రజల మన్ననలు పొందింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విలేకరుల సమావేశం.. సీజేఐపై అభిశంసన తీర్మానంతో దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ప్రజల విశ్వాసాలు సన్నగిల్లుతున్న సమయంలో.. తామేన్నటికీ 'ప్రజాస్వామ్య రక్షకులమే' అని నిరూపించుకుంది. కర్నాటక వ్యవహారంలో అర్ధరాత్రి కోర్టు తలుపులు తెరిచి మరోసారి సామాన్యుడికి న్యాయస్థానాలపై భరోసా కల్పించింది. ఔను. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిందని, బీజేపీ ఓడిందని ప్రచారం జరుగుతున్నా... అంతిమంగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది మాత్రం సుప్రీంకోర్టే అని చెప్పాలి. కర్నాటక మొత్తం వ్యవహారంపై గత నాలుగైదు రోజులుగా సుప్రీంకోర్టులో అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ నిర్ణయంపై అర్ధరాత్రి విచారణ చేపట్టిని న్యాయస్థానం... ప్రొటెం స్పీకర్ నియామకం అంశంపై మరోసారి సెలవు రోజు(శనివారం) కూడా కోర్టు తలుపులు తెరిచింది.
కీలకమైన సుప్రీం తీర్పు....
కర్నాటకలో బీఎస్ యడ్యూరప్ప సర్కారు బలనిరూపణకు ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా 15 రోజుల గడువు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. 'ప్రజాస్వామ్యం హత్య' జరుగుతోందని అభిషేక్సింఘ్వి ఆందోళనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రా.. అప్పటికప్పుడు జస్టిస్ ఎస్కే సిక్రీ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై గురువారం తెల్లవారుజామున 5.30 నిమిషాల వరకు విచారణ చేపట్టిన ధర్మాసనం.. తిరిగి శుక్రవారం ఉదయం మొదటి కేసుగా ఈ అంశంపై వాదనలు విన్నది. బలనిరూపణకు ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన 15 రోజుల కాలవ్యవధిని కుదించింది. ఒక్కరోజులోనే అంటే శనివారమే విశ్వాస పరీక్ష చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు.. కర్నాటకలో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. సీఎంగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేయడం, గవర్నర్ 15 రోజులు కాలవ్యవధి ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని బీజేపీ సర్కారే కొలువుదీరుతుందని అంతా భావించారు. కానీ సుప్రీంకోర్టు ఝలక్తో బీజేపీ కుదేలైంది. ఒక్క రోజులో ఆ పార్టీల ఎమ్యెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో విఫలం కావడంతో చివరకు బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయకతప్పలేదు. బీజేపీ తనకు తగిన సంఖ్యాబలం ఉందని చెప్పడంతో ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించడం కూడా ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఒకానొక సమయంలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని భీంకారాలు పలికిన బీజేపీ... సుప్రీంకోర్టులో ఆ వివరాలను వెల్లడించడంలో విఫలమైంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశంపై దృష్టిసారించింది. ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పక్షంలో గవర్నర్ ఏ రాజకీయ పార్టీని ముందుగా ఆహ్వానించాలన్న అంశంపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఫలితంగా భవిష్యత్తులో కర్నాటకలాంటి పరిస్థితి మరే ఇతర రాష్ట్రంలో తలెత్తితే ఈ తీర్పు కీలకం అవుతుంది.
సెలవు రోజూ విచారణ...
బలపరీక్షపై కీలకమైన తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రొటెంస్పీకర్గా గవర్నర్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బోపయ్య నియామకంపై కాంగ్రెస్ వేసిన పిటిషన్ను శనివారం(సెలవు రోజు) విచారణ చేపట్టింది. సాధారణంగా శనివారం, ఆదివారం రెండు రోజులు కోర్టుకు సెలవు. విషయం ప్రాధాన్యత దృష్ట్యా జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్భూషణ్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఏ వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియామించాలన్న విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన ధర్మాసనం.. బలపరీక్ష పారదర్శకంగా జరిగేలా ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించింది. ఇలా కర్నాటక వ్యవహారంలో సుప్రీం వెలువరించిన తీర్పులు ప్రజాస్వామ్యపరిరక్షణకు దోహదపడ్డాయి. లేకపోతే ఆ రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
సుప్రీంకోర్టు వేసవికాలం సెలవులు..
గడిచిన వారం రోజులు బిజీబిజీగా గడిపిన సుప్రీంకోర్టుకు తాళం పడింది. శనివారం నుంచి జులై 2 వరకు 44 రోజుల పాటు వేసవికాలం సెలవుల దృష్ట్యా కోర్టు మూతపడనుంది. అయితే సెలవు రోజుల్లో కీలకమైన అంశాలపై వేకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.