Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూత్తుకుడి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో వరుసగా మూడో రోజు గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పట్టణమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసుల హింసాకాండ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా గురువారం నిరసనలు మిన్నంటాయి. చెన్నై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, కాపర్ స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో తూత్తుకుడిలో ఇంటర్నెట్ సేవలను ఈ నెల 27 వరకూ వరకు నిలిపివేశారు. తూత్తుకుడితోపాటు తిరునెల్వేలి, కన్యాకుమారిలోనూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సోషల్మీడియా ద్వారా ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ముందు స్టాలిన్ నిరసన
చెన్నైలోని ముఖ్య మంత్రి పళని స్వామి కార్యాలయం ముందు డీఎంకే నేత ఎంకె స్టాలిన్ ధర్నాకు దిగారు. అసమర్థుడైన ముఖ్య మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కలసి సీఎం కార్యాలయం ముందు బైఠాయించగా, వారిని పోలీసులు బలవంతంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది డీఎంకే, ఇతర పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. '13 మంది అమాయక ప్రజలు మృతిచెందిన ఘటనలో నిందితులపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ జిల్లాను సందర్శించి బాధితులను పరామర్శించను కూడా లేదు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి, డీజీపీ రాజేంద్రన్ వెంటనే రాజీనామా చెయ్యాలి' అని స్టాలిన్ డిమాండ్ చేశారు.
బెంగళూరులోని వేదాంతా కార్యాలయం ఎదుట ఆందోళనలు
బెంగళూరులోని ఎంజి రోడ్లోగల వేదాంతా కార్యాలయంవద్ద వందలాది మంది స్థానికులు గురువారం మధ్యాహ్నం ధర్నాకు దిగారు. తూత్తుకుడిలో పోలీసు కాల్పుల ఘటనను ఖండించారు. కాగా, తూత్తుకూడిలో జిల్లా కలెక్టర్ను బదిలీ చేసిన ప్రభుత్వం కత్తగా సందీప్ నందూరీకి ఆ బాధ్యతలు అప్పగించింది. పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడం తన తొలి ప్రాధాన్యత అని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సందీప్ నందూరీ అన్నారు. మరోవైపు పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వారి మృతదేహాలను భద్రపరచాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మే 30 వరకూ ఆ మృతదేహాలు ప్రభుత్వ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.
స్టెరిలైట్ ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో కర్మాగా రానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపి వేశారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్లాంట్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్టెరిలైట్ రాగి కర్మాగారం విస్తరణ పనులపై స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. స్థానికుల ఆందోళనలతో దిగొచ్చిన పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. ప్లాంట్ లైసెన్స్ను పునరుద్ధరించేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి దష్టికొచ్చింది. దీంతో స్పందించిన మండలి.. ప్లాంట్కు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
పోలీసు చర్యను సమర్థించుకున్న పళనిస్వామి
తమ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్న కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగిన నిరసనకారులపై పోలీసుల క్రూరమైన చర్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి సమర్థించు కున్నారు. నిరసనకారుల్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయనీ, ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు వాహనాలకు నిప్పుపెడుతుంటూ వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. 'స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులను కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు తప్పుతోవపట్టించారు. అమాయక ప్రజలను ప్రతిపక్షాలు ఆందోళనలకు ప్రేరేపించాయి' అన్నారు. కాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇప్పటికైనా కండ్లు తెరిచి వాస్తవాలను చూడాలని, మూడు నెలల నుంచి వారు చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశాయి.
దర్యాప్తునకు ఎన్హెచ్ఆర్సీ పిటిషన్
తూత్తుకుడిలో పోలీసు కాల్పులపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించనున్నది.
క్రియాశీలక దర్యాప్తు జరపండి : సీపీఐ(ఎం)
తూత్తుకూడి మారణకాండపై క్రియాశీలక దర్యాప్తు చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఘటనలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందనీ ఆ పార్టీ సౌత్ చెన్నై జిల్లా కార్యదర్శి పక్కియం ఆరోపించారు. న్యాయపరమైన జోక్యం అవసరమనీ, కోర్టు నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలనీ పక్కియం డిమాండ్ చేశారు. పోలీసుల చర్య విస్మయా నికి గురిచేసిందనీ, శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే దానికి విఘాతం కల్పించారని ఆరోపించారు.
'నటించింది చాలు ఇక వెళ్లు'
ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి వుండగా, అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా లాఠీతో బెదిరిస్తూ.. 'నటించింది చాలు ఇక వెళ్లు' అంటూ కసురుకున్నాడు ఓ పోలీసు. బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది తమిళనాడులోని తూత్తుకుడిలో చోటుచేసుకున్న ఘటన. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మత్యువాతపడ్డారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో కలియప్పన్ (22) అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా 'నటించింది చాలు ఇక వెళ్లు' అంటూ కసురుకుంటున్న ఘటనను స్థానిక రిపోర్టుర్ వీడియో తీశాడు. దాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
'క్రిమినల్ కంపెనీకి పోలీసు రక్షణ'
'వేదాంత ఒక క్రిమినల్ కంపెనీ. లండన్లో ఉన్న ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఓ క్రిమినల్. మహారాష్ట్ర, నియాంగిరి హిల్స్లో వాతావరణాన్ని నాశనం చేశాడు. కొండలు, గుట్టలు, అడవుల్లోని సహజ వనరులను దోచుకుంటున్నాడు. అతనిలాంటి క్రిమినల్స్కు మన పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. క్రిమినల్స్కు సహకరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినదే తూత్తుకడి పోరాటం' అని హైకోర్టు న్యాయవాది ఎస్ బాలన్ వ్యాఖ్యానించారు.