Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడా మీడియా సంస్థల ప్రచార వ్యూహం
- కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్తో బహిర్గతం
- వందలకోట్లలో ఒప్పందాలకు సిద్ధం?
- నల్లధనం, పెయిడ్న్యూస్లకూ ఓకే
- రంగంలోకి కొన్ని తెలుగుఛానళ్లు
న్యూఢిల్లీ : బడా మీడియా సంస్థలు హిందూత్వ ఎజెండాను అమలు చేసేందుకు సుముఖంగా వున్నాయని కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. నల్లధనం, పెయిడ్ న్యూస్ వంటి వాటికి కూడా అవి మద్దతిస్తున్నాయని వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్లను ఆ వెబ్సైట్ బయట పెట్టింది. 2019 ఎన్నికలకు ముందుగా హిందూత్వ ఎజెండాను ప్రచారం చేయడంలో, ఓటర్లను చీల్చడంలో సాయపడేందుకు కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయో దాదాపు రెండు నెలల క్రితం కోబ్రా పోస్ట్ మొదటగా వెల్లడించింది. కొన్ని పెద్ద వార్తాపత్రికలు, టివి చానెళ్ళకు చెందిన మేనేజర్లు, యజమానులతో హిందూత్వ ప్యాకేజీ అమలు చేయడానికి జరిపిన రాయబారాలు, బేరాసారాలను రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను రెండో విడతగా విడుదల చేశారు. ప్రజల్లో మత ఘర్షణలు చెలరేగేలా చూసేందుకు, అవసరమైన విధంగా వ్యవహరించేందుకు దాదాపు 25 వార్తా సంస్థలు సముఖత వ్యక్తం చేశాయని కోబ్రా పోస్ట్ శుక్రవారం తెలిపింది. అందుకు సంబంధించిన రికార్డింగ్లను విడుదల చేసింది. పైగా ఒక పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా కూడా చేస్తామని చెబుతూ దానికీ ఒక 'ధర'ను ఆ వార్తా సంస్థలు ప్రకటించాయని కోబ్రా పోస్ట్ తెలిపింది. రహస్య విలేకరి చేసిన ఈ ప్రతిపాదనలను కేవలం రెండు మీడియా సంస్థలు మాత్రమే తిరస్కరించాయి. అవి బెంగాలీ వార్తా పత్రికలైన 'వర్తమాన్', 'దైనిక్ సంబంధ్' లు. టైమ్స్ గ్రూపునకు చెందిన వినీత్ జైన్ వంటి ప్రొప్రయిటర్లతో సహా అనేక మీడియా సంస్థలు ఈ లావాదేవీలు ఎలా వుండాలో కూడా చర్చలు జరిపాయి. ఇందులో చేతులు మారేది వందల కోట్ల రూపాయిల్లో వుంది, ఇదంతా కూడా నల్లధనమే. టైమ్స్ గ్రూపు సంస్థల్లో టైమ్స్ నౌ చానెల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా అనేక మీడియా వేదికలు వున్నాయి. పుష్ప శర్మ అనే జర్నలిస్టును 'ఆచార్య అతల్'గా పేర్కొంటూ కోబ్రా పోస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్కు వినియోగించింది. నాగపూర్కి చెందిన ఆర్ఎస్ఎస్ సభ్యుడినని లేదా వారికి అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ ఆచార్య అతల్ వారిని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ వెబ్సైట్ ఆ రికార్డింగ్లన్నింటినీ యూట్యూబ్లో పెట్టింది. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా హిందూత్వ ఎజెండాను ప్రచారంచేస్తే ఎంత డబ్బు ముట్టచెప్పేది చెబుతూ అతల్ మీడియా సంస్థల ఎగ్జిక్యూటివ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. హిందూత్వ సమాచారం వారి పత్రికల్లో లేదా రేడియో స్టేషన్లలో, టీవీ చానెళ్ళలో, వెబ్సైట్లలో వస్తే దానికి కొంత మొత్తం చెల్లించాలన్నది ఆ ఒప్పందాల సారాంశం. ఈ మొత్తం లావాదేవీల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు వినీత్ జైన్, టైమ్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు సంజీవ్ షా., ఇండియా టుడే గ్రూపు వైస్ ఛైర్పర్సన్ కల్లి పూరీ. తమకు కావాల్సినట్టు హిందూత్వ ఎజెండాను ప్రచారం చేస్తే రు.500కోట్లు ముట్టచెబుతానని ఆచార్య అతల్ వారికి ఆశ చూపారు. పైగా ఆ ఎజెండా ప్రచారం కూడా ఎలా జరగాలో మాట్లాడుకున్నారు. కృష్ణుడిపై, భగవద్గీతపై కార్యక్రమాలు ప్రసారం చేస్తూ వాటి మధ్యలో ఈ ఎజెండాను ప్రచారం చేసేలా వుండాలి. ఒకోసారి నగదు చెల్లింపులు ఎలా జరగాలో కూడా జైన్, షా లు ఆ విలేకరికి సూచనలు చేశారు. కొన్ని వ్యాపారసంస్థలు వున్నాయనీ, వాటికి మీరు నగదు చెల్లిస్తే అవి తమకు చెక్కులు ఇస్తాయని వినీత్జైన్ సూచించారు. వీటిలో కొన్ని తెలుగు చానళ్లు ఉన్నట్టు వెలుగుచూసింది.