Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎస్జేకే చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదులు హతం
ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్లో శుక్రవారం చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లో ఐఎస్జేకే చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీగుప్వారా ప్రాంతంలోని నౌషేరా ఖీరమ్ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ప్రతిగా కాల్పులు ప్రారంభించాయి. కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకాశ్మీర్(ఐఎస్జేకే) చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. కాగా ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఎన్కౌంటర్ చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతమంది అందోళనకారులు భద్రతాదళాలపై రాళ్లు విసురుతూ కవ్వింపుచర్యలకు పాల్పడ్డారు. పరిస్థితిలను అదుపులోకి తెచ్చెందుకు అదనపు బలగాలను ఉపయోగించారు. ఈ క్రమంలో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీనగర్, పూల్వామా, అనంత్నాగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టుగా అధికారులు వెల్లడించారు. కాగా కేంద్రప్రభుత్వం గతవారమే కాల్పుల విరమణకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో భద్రతాదళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను మరింత ముమ్మరం చేశాయి.
భద్రతాబలగాలపై గ్రెనెడ్ దాడి: జమ్మూకాశ్మీర్లోని పూల్వామాలో జరిగిన గ్రెనెడ్ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ట్రాల్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు గ్రెనెడ్ విసిరి, బహిరంగ కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. అనంత్నాగ్లో ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లోనే ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.
అఖిలపక్ష సమావేశం
రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించేందుకు గవర్నర్ వొహ్రా శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించిన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో పీడీపీనేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్ పాల్గొన్నారు. మెహబూబా నేతృత్వంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గవర్నర్ పదవీకాలం జూన్ 25తో ముగుస్తుండగా కేంద్రం తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగనుంది.