Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలను మున్సిపాల్టీలుగా మారుస్తున్నారు : బివి రాఘవులు
- ఢిల్లీలో ప్రారంభమైన కేంద్ర కమిటీ సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు దేశ సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేసే కుట్రలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాసి మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చుతున్నదని విమర్శించారు. ఇందులో భాగంగానే దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావనను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇక కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి మోడీ సర్కారు అన్యాయం చేయాలని చూస్తున్నదని, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో నిరసనకు దిగారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కేంద్ర కమిటీ సమావేశాలపై పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు మీడియాతో మాట్లాడారు. 'హైదరాబాద్లో జరిగిన పార్టీ మహాసభ అనంతర రాజకీయ పరిస్థితులపై కేంద్రకమిటీలో చర్చించాం. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ అంశంతో పాటు కేరళ, బెంగాల్, త్రిపురలో బీజేపీ పాల్పడుతున్న హింసాత్మక రాజకీయాల గురించి చర్చించాం. కాశ్మీర్లో పరిస్థితి దిగజారడానికి బీజేపీ-పీడీపీ ప్రభుత్వమే కారణం. ప్రస్తుతం గవర్నర్ పాలన విధించి సమస్యను మరింత సంక్లిష్టం చేశారు. కాశ్మీర్ ప్రజలను భారతదేశం నుంచి ఇంకాస్త దూరం చేసే విధంగా నిర్భందాలు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు' అని వివరించారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా వ్యవహరించడం దేశ ప్రయోజనాలకు ప్రమాదకరమని రాఘవులు చెప్పారు. ప్రజాస్వామిక శక్తులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించేలా ఒత్తిడి చేయాలని కోరారు. ఇక కొలీజియం సిఫారసులను కేంద్రం అడ్డుకుంటూ న్యాయమూర్తుల నియామకం చేపట్టడం లేదని విమర్శించారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నది తెలీకుండా పోయిందన్నారు. న్యాయమూర్తుల నియామకంలో వివాదాలకు తావులేకుండా 'నేషనల్ జ్యూడీషియల్ కమిషన్' ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం)గా మొదటి నుంచి కోరుతున్నామని మరోసారి గుర్తు చేశారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వం సంప్రదింపలు జరపాలని సూచించారు. మోడీ సర్కారు రైతాంగ సమస్యలపై స్పందించడం లేదని, సెప్టెంబర్ 5వ తేదీన చలోపార్లమెంట్ నిర్వహించేందుకు ఆయాసంఘాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. సీపీఐ(ఎం) పార్టీగా సంపూర్ణ మద్దుతు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. త్రిపుర, బెంగాల్, కేరళలో సీపీఐ(ఎం)ను పూర్తిగా నాశనం చేయాలని ఆర్ఎస్ఎస్, సంఫ్ుపరివార్ యత్నిస్తున్నాయని విమర్శించారు. సంఫ్ుపరివార్ శక్తులకు రాజకీయంగా, నిర్మాణపరంగా సమర్ధంగా ఎదుర్కొవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 2019 ఎన్నికల గురించి ఈ సమావేశాల్లో చర్చించలేదని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.
కేసీఆర్ రాష్ట్రాలతో సానుకూలంగా వ్యవహరించాల్సింది..
బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్... ఫైనాన్స్ కమిషన్ నిబంధనలపై ఇతర రాష్ట్రాలతో ఎందుకు సానుకూలంగా వ్యవహరించడం లేదో ఆయనే చెప్పాలని రాఘవులు అన్నారు. ఢిల్లీలో గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు మద్దతు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మొదట ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్.. ప్రస్తుతం ఆ అంశంపై మాట్లాడ్డం లేదని అన్నారు. కేంద్ర సర్కారు సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ ఇతర రాష్ట్రాలతో గొంతు కలిపితేనే తెలంగాణకు కూడా ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.