Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటీశ్వరులైన ఎంపీలకు సబ్సిడీ ఆహారం
- చికెన్ కర్రీ రూ.50...దోసె రూ.12
- పార్లమెంట్ క్యాంటీిన్లో కొనసాగుతున్న పాత విధానం
- సబ్సిడీ రద్దు చేశామన్న 'మోడీ సర్కార్' ప్రకటన అబద్ధం
- సమాచార హక్కు...వివరాల్లో బహిర్గతం
ప్రస్తుత లోక్సభలో 82శాతం మంది ఎంపీలు, రాజ్యసభలో 85 శాతం ఎంపీలు కోటీశ్వరులే. మరి ఇంతటి ధనవంతులకు సబ్సిడీ ధరల్లో ఆహారాన్ని అందజేయాల్సిన అవసరమేముంది? ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని ఇలా 'ఆర్థికంగా ఉన్నవారికి' ధారపోస్తే ఎలా? అని సామాన్యుడిలో ఆగ్రహం, ఆవేదన కలుగుతోంది.
న్యూఢిల్లీ: హైదరాబాద్ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్. హైదరాబాద్లోని వివిధ రెస్టారెంట్లలో దీని ధర రూ.180 నుంచి మొదలవుతుంది. అలాంటి 'హైదరాబాద్ చికెన్ బిర్యానీ' పార్లమెంటు క్యాంటీన్లో రూ.65కు మన ఎంపీలకు అందజేస్తున్నారు. కాఫీ రూ.5, మటన్ రూ.45, చేపల కూర రూ.40కు పార్లమెంటు క్యాంటీన్ ఎంపీలకు వడ్డిస్తున్నారు. ఇందులో కొత్తేముంది. పాత విషయమే కదా? అని అనిపించొచ్చు. ముమ్మాటికీ ఇది పాత విషయం కాదు.
పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాలు సబ్సిడీ ధరల్లో అందజేయటం గురించి నాలుగేండ్ల క్రితం పెద్ద వివాదం రేగింది. సామాన్య ప్రజలెవరీకి అందుబాటులో లేని ధరలు...పార్లమెంట్ సభ్యులకు ఉండటమేంటి ?అన్న ఆగ్రహం దేశవ్యాప్తంగా ఏర్పడింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక, క్యాంటిన్లోని ఆహార పదార్థాలపై సబ్సిడీని రద్దు చేస్తున్నామని మోడీ సర్కార్ ఆనాడు ప్రకటించింది. 'నో ప్రాఫిట్-నో లాస్' అనే విధానంలో క్యాంటిన్ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ అదంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. గత రెండున్నరేండ్లుగా ప్రజలకు వాస్తవం తెలియకుండా మోసం చేస్తున్నారని తెలిసిపోయింది. ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ 'సమాచార హక్కు' ద్వారా సేకరించిన వివరాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సబ్సిడీ రద్దు చేసినట్టు చెప్పారు..అంతే..
80 శాతం సబ్సిడీతో పార్లమెంటు క్యాంటిన్లో ఆహార పదార్థాల్ని వడ్డిస్తున్నారని దేశవ్యాప్తంగా 2015లో విమర్శలు వెల్లువెత్తాయి. 100 రూపాయలున్న ఆహారాన్ని కేవలం 20 రూపాయలకు ఎంపీలకు అందజేస్తున్నారు. కోటీశ్వర్లు, శత కోటీశ్వర్లు ఉన్న పార్లమెంటులో ప్రజల ధనం వృధా అవుతోందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో మోడీ సర్కార్ దీనిపై ఓ కమిటీ వేసింది. 'లాభం...నష్టం లేకుండా' అనే విధానంలో ఆహార పదార్థాల్ని అమ్మాలన్న ప్రతిపాదన కమిటీ చేసింది. అంటే సబ్సిడీ రద్దు చేయమని సూచించింది. కమిటీ చేసిన సూచన ప్రకారం, 2016, జనవరి 1 నుంచి పార్లమెంటు క్యాంటిన్లో ఆహార పదార్థాలు వాస్తవ ధరల్లో లభ్యమవుతాయని లోక్సభ స్పీకర్ స్వయంగా ప్రకటించారు.
కానీ ఇది పచ్చి అబద్ధమని...మోసమని ఇప్పుడు బయటపడింది. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యేసరికి... దానిని తట్టుకోవడానికి తాత్కాలికంగా ఒక ఉత్తుత్తి ప్రకటన చేశారని తెలిసింది. దీనికి సంబంధించి ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ సేకరించిన సమాచారం ఇలా ఉంది. 2013-14లో పార్లమెంటు క్యాంటిన్లో ఆహారంపై సబ్సిడీ వల్ల జరిగిన వ్యయం రూ.14.09 కోట్లు. 2014-15లో రూ.15.85కోట్లు. 2015-16లో 15.97కోట్లు. సబ్సిడీ రద్దు చేసిన...2016-17లో కూడా బిల్లు 15.40కోట్లు. ఈ గణాంకాల్ని బట్టి సబ్సిడీ రద్దు కాలేదన్నది అర్థమవుతోంది. అంటే ప్రజలకు అబద్ధం చెబుతూ...మోడీ సర్కార్ మోసం చేస్తోందని తెలుస్తూనే ఉంది.