Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార హక్కును నీరుగార్చేందుకేనంటూ
- ఆర్టీఐ కార్యకర్తల మండిపాటు
- నిరసనగా ఈ నెల 18న ఢిల్లీలో ర్యాలీ
- దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు
న్యూఢిల్లీ: సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం-2005ను సవరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లును చర్చకు పెట్టనున్నది. 18రోజులపాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 18 బిల్లుల్లో ఆర్టీఐ చట్ట సవరణ బిల్లు కూడా ఉన్నది. అయితే, సవరణ బిల్లులోని అంశాలను బహిరంగపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం పట్ల సమాచార హక్కు కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఆర్టీఐ కార్యకర్తలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఆర్టీఐ అధికారుల వేతనాలపై సమీక్ష మాత్రమే బిల్లులో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు లీకులిచ్చాయి. ఆర్టీఐ చట్టం-2005 ప్రకారం కేంద్ర సమాచార కమిషనర్ల వేతనాలు కేంద్ర ఎన్నికల కమిషనర్ల వేతనాలకు సమానంగా, రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల వేతనాలకు సమానంగా ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్తో కేవలం చట్టబద్ధమైన సమాచార కమిషన్ను సమానంగా చూడలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటివరకూ సమాచార కమిషనర్ల వేతనాలను పార్లమెంట్ నిర్ణయించగా, సవరణ బిల్లు అమలులోకి వస్తే నిర్ణయాధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోకి మారుతుంది. దాంతో, తమకు వ్యతిరేక సమాచారాన్నిచ్చేందుకు కమిషనర్లు నిరాకరించేలా ప్రభుత్వాలు వారిపై ఒత్తిడి చేసే అవకాశముంటుందని ఆర్టీఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వాల పారదర్శకతను ప్రజల ముందుంచేందుకు ఉద్దేశించిన ఆర్టీఐ చట్టాన్ని నీరు గార్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
'సవరణ బిల్లులోని అంశాలను బహిర్గతపరిచేందుకు ప్రభుత్వం నిరాకరించడం ఆందోళన కలిగిస్తోంది. చట్టాలు చేయడానికి ముందు పౌరులతో సంప్రదింపులు జరపకపోవడం, రహస్యంగా ఉంచడం ప్రజాస్వామిక సూత్రాలను ఉల్లంఘించడమే' అంటూ ప్రజల సమాచార హక్కుపై జాతీయ ప్రచార సంస్థ (ఎన్సీపీఆర్ఐ) ఓ ప్రకటనలో విమర్శించింది. ఈ ఏడాది మే నెల లోనూ ప్రధాని మోడీకి ఎన్సీపీఆర్ఐ ఓ లేఖ రాసింది. చట్టాలపై ముందస్తు సంప్రదింపుల విధానానికి కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఆమోదం తెలిపిందని ఎన్సీపీఆర్ఐ తన లేఖలో పేర్కొన్నది. చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఆయా మంత్రి త్వశాఖల వెబ్సైట్లలో 30రోజులపాటు అందుబాటులో ఉంచాలని, క్యాబినెట్ ఆమోదానికి పంపడానికి ముందు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని ప్రధానికి ఎన్సీపీఆర్ఐ గుర్తు చేసింది.
కేంద్రం తేనున్న బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు ఎన్సీపీఆర్ఐతోపాటు నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్(ఎన్ఏపీఎం), యాంటీ కరప్షన్ టీం(ఏసీటీ), నేషనల్ రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) నిర్ణయించాయి. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18న ఢిల్లీలో ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపాయి. ప్రజావేగుల చట్టం, లోక్పాల్ చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని, ఎన్నికల బాండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 1-30 నుంచి 4 గంటల వరకు లోక్సభ స్పీకర్ గదిలో, కానిస్టిట్యూషన్ క్లబ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. తమ వైఖరిని వెల్లడించాలంటూ రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపాయి.