Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్
విజయవాడ: సుమారు లక్ష మంది ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్, వేతన ఒప్పందాలపై ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్తో యూనియన్ ప్రతినిధులు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమ్యారు. ఈ సందర్భంగా తపన్సేన్ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమలో 2012 నుంచి పెన్షన్ అమలు చేయాల్సివుండగా, నేటికీ విధి విధానాలు తయారు చేయకపోగా మరో రెండు నెలల వ్యవధి అడగటం ఉక్కు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శమన్నారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగ విరమణ చేస్తున్నారని, ఏండ్ల తరబడి సేవలు అందించిన వారి పట్ల ప్రదర్శించాల్సిన బాధ్యత ఇదేనా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెన్షన్పై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి నూతన వేతన ఒప్పందాలు అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ అంశంపై చర్చలు ప్రారంభించకపోవడం శోచనీయ మన్నారు. సంస్థ లాభాలు, సస్టెయినబిలిటీ తదితర అంశాలు ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉన్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వ విధానాల ప్రభావం స్టీల్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవడంతో సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఉద్యోగులతో ప్రమేయం లేని అంశాలను సాకుగా చూపి వేతన ఒప్పందాలు చేయడానికి ముందుకు రాకపోవడం ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ వైఖరికి తార్కణమన్నారు. ఈ వైఖరిని తక్షణం మార్చుకోవాలని, లేనిపక్షంలో కార్మిక ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో విశాఖ స్టీల్ప్లాంట్ గుర్తింపు యూనియన్ తరపున నాయకులు ఎన్.రామారావు, జె.అయోధ్యరాం, వైటి.దాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, ఉక్కులో నియామకాలు తక్షణం జరపాలని వినతిపత్రాన్ని అందచేశారు.