Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి ఆదేశాలతో పున పరిశీలన : టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్య మంత్రి చురకలతో వెనక్కు తగ్గింది. ఆగస్టు 11నుండి 16 వరకు జరగనున్న మహాసంప్రోక్షణ రోజుల్లో శ్రీవారి దర్శన భాగ్యం ఉండదని ఈనెల 14న ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంపై విస్తృతమైన ప్రచారం సాగింది. ఒక్క సారిగా శ్రీవారి ఆలయం మూసేస్తారని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. 12ఏళ్ళకో పర్యాయం జరిగే బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం ఉంటుందని, అదే రోజుల్లో వరుస సెలవులు ఉండడంతో రోజుకు లక్ష మంది భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉందని టిటిడి పేర్కొంది. తక్కువ సమయంలో భక్తులకు దర్శనం చేయించడం సాధ్యం కాదని ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా సమావేశమై మీడియాకు ప్రకటించింది. ఈ విషయమై మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి టిటిడికి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.. దీంతో టిటిడి ఛైర్మన్, ఈఓలు మంగళవారం ఉదయం మరో మారు తాము తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈనెలలో జరగనున్న మరో ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం వెల్లడిస్తామని ఈఓ వెల్లడించారు. తమకున్న సమయంలో రోజుకు దాదాపు 15 వేల మందిని మాత్రమే భక్తులను అనుమతించే అవకాశం ఉందన్నారు.
దర్శనం నిలిపేయడం సరికాదు : సిఎం
మహా సంప్రోక్షణ సందర్భంగా యాత్రికులకు దర్శనం నిలిపివేత సరికాదని, నిర్ణీత సమయంలో దర్శనం కల్పించాలని సిఎం చంద్రబాబు టిటిడి అధికారులకు సూచించారు. మహా సంప్రోక్షణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయడం సరికాదని, సంప్రోక్షణ జరిగేటప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దర్శనం కల్పించాలని సూచించారు. ఈ సమయంలో యాత్రికుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దన్నారు. అయితే దర్శనాన్ని పరిమితం చేయొచ్చన్నారు. దీంతో టిటిడి కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. నిర్ణీత సమయంలో యాత్రికులకు దర్శనం కల్పించే విధంగా సమయాలను కేటాయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.