Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగబడుతున్న కామాంధులు.. పసికందులపై పైశాచికాలు
- సభ్యసమాజం సిగ్గుపడేలా దారుణాలు
సభ్యసమాజం సిగ్గుపడేలా...పసికందులపై పైశాచిక ఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. 14 నెలల పసికందు మొదలు పెడితే... పాపను ఆడిస్తాననీ... పిల్లలను అపహరించుకుపోయి... కిరాతకానికి పాల్పడిన దుర్మార్గ ఘటనలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. చిన్నారులపై మానవ మృగాళ్లు విరుచుకుపడిన ఘటనల వివరాల్లోకి వెళితే..
ఆడిస్తానని ఎత్తుకెళ్ళి..
భోపాల్, చెన్నై, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో 14 నెలల పసిగుడ్డును చిదిమేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విడిషా జిల్లా తాజ్పుర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు బాధితురాలి కుటుంబానికి పరిచయస్తుడేననీ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కపూర్ చెప్పారు. ఆడిస్తానంటూ పాపను నిందితుడు గజరాజ్సింగ్ భిల్ ఆదివారం తన ఇంటికి తీసుకెళ్ళాడనీ, కొన్ని గంటల తర్వాత గుక్కపెట్టి ఏడుస్తున్న పాపను గజరాజ్సింగ్ తన కొడుకు ఇచ్చి పంపించాడు. పాప ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలోని సిరోంజ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. పరీక్షలు చేసిన వైద్యులు పసికందుపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించారనీ వినీత్ కుమార్ తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. మైనరుపై లైంగికదాడికి పాల్పడిన దోషి (40)కి మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా కోర్టు ఇటీవల మరణశిక్ష విధించింది.
11 ఏండ్ల బాలికపై 22 మంది...
అభం శుభం తెలియని చిన్నారిపై కొంతమంది పశువులకంటే హీనంగా వికృత చర్యలతో విరుచుకుపడ్డారు... ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 22 మంది.. 11 ఏండ్ల బాలికపై దాదాపు ఏడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన చెన్నైలోని పురసవాల్క ప్రాంతంలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో వెలుగుచూసింది. వినికిడి సమస్య ఉన్న బాలికపై మొదట సెక్యూరిటీ గార్డులు, ఎలివేటర్ ఆపరేటరు, ప్లంబర్లు ఇలా.. 22 మంది అఘాయిత్యానికి పాల్పడగా వారిలో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఎలివేటర్ ఆపరేటర్ రవి కుమార్ (66) మొదట ఆమెకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తాగించి.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఇద్దరు... ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే దాన్ని బయట పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాలిక విషయం ఎవరికీ చెప్పలేదు. గత శనివారం ఢిల్లీలో చదువుకుంటున్న తన సోదరి ఇటీవలే చెన్నై రావడంతో బాధితురాలు ఆమెతో విషయం చెప్పింది. వెంటనే స్పందించిన ఆమె, తల్లిదండ్రుల సాయంతో అయనవరం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రవి కుమార్ మొదట తనపై లైంగికదాడి చేశాడనీ బాలిక పోలీసులకు వివరించింది. మూడు రోజుల తర్వాత మద్యం సేవించిన మరో ఇద్దర్ని అతడు తీసుకొచ్చాడనీ, వారిద్దరూ అఘాయిత్యం చేయడంతోపాటు, దానిని వీడియో తీశారనీ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత మరికొందరు.. ఇలా వీడియోతో బెదిరించి... దాదాపు 22 మంది కిరాతక చర్యకు ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది.
ఆరేండ్ల మైనరుపై రాజధానిలో...
మధ్య ఢిల్లీలో 24 ఏండ్ల యువకుడు నిరాశ్రయురాలైన ఆరేండ్ల మైనరును అపహరించుకువెళ్ళి కిరాతక చర్యకు ఒడిగట్టాడు. మింటో రోడ్లోని కాలీ మందిర్ వద్ద ఆడుకుంటున్న బాలికను ఈ నెల 14న నిందితుడు అపహరించుకుపోయాడు. కాగా, పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. కాగా, తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న ఆమెను అదే రోజు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో గుడికి కొద్ది దూరంలో కనుగొన్నారు. సమీప ఆస్పత్రికి తీసుకెళ్ళగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైందనీ, లోపలి అవయవాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్యులు చెప్పారు. డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మాలివాల్ ఆస్పత్రిలో బాలికను పరామర్శించారు. ఆమె కోలుకునేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. నిందితుడిని తక్షణమే అరెస్టుచేయాలని స్వాతి డిమాండ్ చేశారు.
అశ్లీల వీడియోలు చూసి.. ఐదుగురు మైనర్లు..
ఉత్తరాఖండ్లో ఐదుగురు మైనర్లు ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9 నుంచి 14 ఏండ్ల వయస్సుగల వారు అఘాయిత్యానికి పాల్పడటానికి రెండు రోజుల ముందు తమ మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్టు పోలీసులు తెలిపారు. బాలికను ఆడుకుందామని నమ్మించి.. ఒక స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళారనీ, అక్కడ వారంతా కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారని చెప్పారు.