Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్య సంరక్షణను చేకూర్చే ''ఆయుష్మాన్ భారత్'' పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని దీన దయాళ్ ఉపాధ్యారు జన్మదినోత్సవాన ప్రారంభిస్తామన్నారు వాస్తవానికి ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలలోనే ఈ పథకాన్ని ప్రకటించారు.. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ప్రారంభిస్తారన్న లక్ష్యంగా దీనిపై సుదీర్ఘకాలంగా కసరత్తు చేస్తూ వచ్చామని నిటి ఆయోగ్కు చెందిన డాక్టర్ వినోద్పాల్ తెలిపారు. దేశంలోని 50 కోట్ల మందికి ఈ పథకం కింద ఆరోగ్య సంరక్షణను అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
పదేపదే పేరు మార్పు
ఆయుష్మాన్ భారత్ను ఇక మీదట ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజెఎవై)గా పేరు మారుస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ పథకానికి పేరు మార్చడం ఇది మూడోసారి. అంతకుముందు తొలుత నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఎన్హెచ్పీఎస్)గా ఉన్న పథకాన్ని ఆయుష్మాన్ భారత్గాను, ప్రస్తుతం పీఎంజెఎవైగాను పేరు మార్చుకున్నది. ఈ పథకం ఎలాగైతే పేరు మార్చుకున్నదో దానిని ప్రారంభించడం కూడా అలాగే వాయిదా పడుతూ వచ్చింది. తొలుత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తామని, ఆ తర్వాత అక్టోబరులో గాంధీ జయంతి నాడు ప్రారంభమవుతుందని బీజేపీ సర్కార్ ప్రకటించుకున్నది. ప్రస్తుతం సెప్టెంబరు 25న దీనదయాళ్ జయంతి రోజున ప్రారంభిస్తామని ప్రభుత్వం వాయిదా వేసుకొంటూ వస్తున్నది.
యూపీఏ సర్కార్ వేసిన పథకమే
ప్రభుత్వం ప్రాథమికంగా యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన్ (ఆర్ఎస్బీవై) పథకాన్నే అమలు చేస్తూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని రాష్ట్రీయ స్వస్థ సురక్ష యోజన (ఆర్ఎస్ఎస్వై)గా పేరు మార్చింది. అటు తరువాత జరిగిన బడ్జెట్ సమావేశాలలో లక్ష రూపాయలు బీమాను వర్తింప చేస్తూ ఎన్హెచ్పీఎస్ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదని భావించిన ప్రభుత్వం ఏడాది పాటు దానిని అమలు చేయలేదు. ఈ పథకం అమలులోకి రాకపోయినప్పటికీ కనీసం పేరులోనైనా స్పష్టతనివ్వలేకపోవడం విశేషం.ఆరోగ్య బీమాకు, ఆరోగ్య సంరక్షణకు మధ్య చాలా వ్యత్యాసముంది. కాని రెండింటిని ఒకటిగా చేసి ప్రభుత్వం ప్రకటనలు వెలువడుతున్నాయి.
అమలులో అవస్థలెన్నో..
ఎన్హెచ్పీఎస్ను అమలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ ఏజెన్సీతో 29 రాష్ట్రాలు అవగాహనా ఒప్పందాలను (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఒడిషా మాత్రం ఈ పథకంలో చేరలేదు. ఈ 29 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు వచ్చే వారం నుంచి ఈ పథకాన్ని స్వచ్ఛందంగా ప్రయోగాత్మకంగా ప్రారంభిం చనున్నాయి. దీనికన్నా ముందు ఈ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో మౌలిక వసతులు ఉన్నాయా, ఈ పథకం కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ నిర్వహించేందుకు నైపుణ్యం గల సిబ్బంది ఉన్నారా? దానికోసం శిక్షణ పొందిన టెక్నిషియన్లు ఉన్నారా, లబ్దిదారులను గుర్తించడం, వారిని పథకం కిందకు తీసుకు రావడం, వారి ఫిర్యాదులను పరిష్కరించడం వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉన్నది. వీటిని పరిష్కరించేందుకు నేషనల్ హెల్త్ ఏజెన్సీకి కేవలం ఆరు వారాలు మాత్రమే సమయమున్నది.
ట్రస్ట్ మోడల్ బీమా విధానం
29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా బీమా సంబంధిత అంశాలను పరిష్కరించనున్నాయి. ప్రయివేటు బీమా కంపెనీల ద్వారా కాకుండా ట్రస్టులను ఏర్పాటు చేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే అంతకుముందు ఆరోగ్య శాఖ దీని గురించి వివరిస్తూ పన్ను చెల్లింపుదారులు చెల్లించిన పన్నులన్నీ ప్రయివేటు బీమా కంపెనీలకు వెళ్ళకుండా ఉంటాయని తెలిపింది. కాని ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రయివేటు బీమా పధకాలను పోలిన విధంగానే దీని అమలుతీరు ఉన్నది. తొలిదశ అమలుకు 10 వేల నుంచి 12 వేల ఆస్పత్రులు అవసరమవుతాయని భావిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పథకం అమలు కోసం కేవలం 7,500 ఆస్పత్రులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి.. దీని కోసం కొన్ని నగరాలలో కొత్త ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.