Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషోత్తపట్నంపై కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా
న్యూఢిల్లీ :పురుషోత్తపట్నం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఏపీ సర్కార్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, ఒడిషాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని, ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన బాధితులకు సరైన పరిహారం అందించడం లేదని ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ను జస్టిస్ రాఘువేణంద్ర సింగ్ రాథోర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ గురువారం విచారించింది. గతంలో పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఒడిషా, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అఫిడవిట్లు దాఖలు చేశాయి. అందులో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తూ చేసుకోలేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ కేసులో ప్రతివాదిగా తమను తొలగించాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఏపి ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేస్తోందని, వెంటనే ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలని కోరింది.