Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతా గోఖలే
చెన్నై: దేశంలో వాస్తవాలు మాట్లాడే వారు ప్రమాదంలో ఉన్నారని.. వారి మెడపై కత్తి వేలాడుతోందని ప్రముఖ రచయిత్రి శాంతా గోఖలే అన్నారు. తమిళనాడులోని ఊటీలో జరుగుతున్న ఊటీ సాహిత్య వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోఖలే మాట్లాడుతూ.. 'దేశంలో మతాలకు సంబంధించి, ప్రస్తుత పరిస్థితులపైనా వాస్తవాలు మాట్లాడినా, రాస్తున్న రచయితల మెడపై కత్తి వేలాడుతోంది. వారందరూ నిజాన్ని నిర్భయంగా చెప్పే వీలులేకుండా ఉంది' అని అన్నారు. దేశంలో ప్రజాసాహిత్యం, రచనలు చేసేవారి ప్రస్తుత పరిస్థితి పదేండ్ల క్రితం టర్కి రచయిత ఒర్హాన్ పామూక్, ఈజిప్టు నవలాకారుడు నాగీబ్ మV్ాఫౌజ్ల వలే ఉన్నదని తెలిపారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు వారిపై దాడి జరిగిందన్నారు. నిజాలను వెలికితీస్తున్న మీడియాపై కూడా తీవ్ర స్థాయిలో నిర్బంధం అమలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యప్రజల ఆయుధంగా తయారు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్)తో రచయితలకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిని ఉపయోగించుకుని సమాజంలోని కొన్ని శక్తులు రచయితల గొంతును నొక్కుతున్నాయని వివరించారు. కులం, మతం, ప్రాంతం పేరిట సాహితీవేత్తలను అణచివేస్తున్నారని, గత కొంతకాలంగా ఇది ఎక్కువైందని చెప్పారు.