Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర పోలీసులకు 'సుప్రీం' సూచన
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలు న్నాయనే ఆరోపణతో దేశంలోని ఐదుగురు పౌర హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన కేసులో మహారాష్ట్ర పోలీసులు కచ్చితమైన ఆధారాలు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. భీమా కోరేగావ్ అల్లర్ల సమయంలో బయటపడిన ఓ లేఖ ఆధారంగా.. సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, వరవరరావు, వెర్నన్ గోసాల్వెస్, అరుణ్ ఫెరీరియాలను గతనెలలో అరెస్టు చేశారు. కాగా, వీరి అరెస్టులను వ్యతిరేకిస్తూ ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్, ప్రభాత్ పట్నాయక్, మరికొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్టులకు గల కచ్చితమైన ఆధారాలు చూపెట్టాలని మహారాష్ట్ర పోలీసులకు సూచించింది. ఒక కేసులో ఎవర్నైనా అరెస్టు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని పోలీసులకు తెలిపింది. కాగా, అరెస్టు అయిన వారికి రాజ్యాంగం మీద గౌరవం లేదని, కోర్టు పర్యవేక్షణలో వారిని విచారిరచాలని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే తెలిపారు. దీనికి కోర్టు స్పందిస్తూ.. ఈ కేసు పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, వారు గీత దాటినట్టు భావిస్తే డేగకళ్లతో పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 24న జరుగనుంది.