Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్పై సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో
న్యూఢిల్లీ:ముస్లిం మహిళల సంక్షేమం పేరుతో కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ పై జారీ చేసిన ఆర్డినెన్స్ అవాంఛనీయం, దురు ద్దేశపూరితమైనదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో వున్న ఈ బిల్లుపై ఎగువ సభలో పూర్తి స్థాయి చర్చ పెండింగ్లోవున్న సమయంలో పార్లమెంట్ను కాదని ఈ ఆర్డినెన్స్ను జారీ చేయటం అప్రజాస్వామికమని విమర్శించింది. ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్ విడాకుల పద్ధతి చట్టవిరుద్ధమైనదని సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రకటించగా, ప్రతిపాదిత చట్టం దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నదని, ఇది ప్రభావిత మహిళలకు ఏ మాత్రం ఉపయోగపడని అనాలోచిత చర్య అని పేర్కొంది. ఈ బిల్లులో ఇంకా సరిచేయాల్సిన అనేక లొసుగులున్నాయని తెలిపింది. ప్రస్తుతం జారీ చేసిన ఆర్డినెన్స్ పాలక పార్టీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినదేనని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పార్లమెంట్ సవరించిన చట్టాన్ని మాత్రమే ఆమోదించాల్సి వుంటుందని సీపీఐ(ఎం)
పొలిట్బ్యూరో అభిప్రాయపడింది.
ఐద్వా నిరసన
ట్రిపుల్ తలాక్ పద్ధతిపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్లో వున్న ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణా చట్టం బిల్లు 2017ను సెలెక్ట్ కమిటీని నివేదించాలని, దీనిని చట్టంగా మార్చే ముందు విస్తృత స్థాయి చర్చ జరగాలని ఐద్వాతో సహా అనేక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న సమయంలో, ఈ ఆర్డినెన్స్ను జారీ చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఐద్వా తన ప్రకటనలో స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించే అంశంపై సమాజంలో అనేక వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను జారీ చేసిందని తెలిపింది. ఇందులో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కేవలం బాధిత భార్యకు మాత్రమే ఇవ్వటం ద్వారా ఈ చట్టం రాక్షస చట్టంగా మారుతున్నదని, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ పేరిట ఆరెస్సెస్, బీజేపీ కూటమి అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాన్ని కండ్లకు కడుతున్నదని విమర్శించింది. ట్రిపుల్ తలాక్తో పాటు భార్య మానసిక, శారీరక హింసకు గురైనట్లు ఫిర్యాదు చేస్తే ఆమె ప్రస్తుత ఐపీసీ 498ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చని ఐద్వా గుర్తు చేసింది. అంతేకాక షాబానో కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు తరువాత ట్రిపుల్ తలాక్ పద్ధతికి విలువలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను జారీ చేయటం పూర్తి అభ్యంతరకరమని తెలిపింది. ఈ పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రభుత్వం వెంటనే తన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. పార్లమెంట్ ముందు పెండిగ్లో వున్న బిల్లును చట్ట రూపంలోకి మార్చే ముందు సెలెక్ట్ కమిటీకి నివేదించాలని, అప్పుడే బాధిత మహిళలకు సరైన న్యాయం జరుగుతుందని ఐద్వా స్పష్టం చేసింది.