Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘాల సమాఖ్య తీర్మానం
న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి, ఆ హామీలు అమలుపరచకపోగా.. రైతులను మోసం చేస్తున్న బీజేపీ సర్కారుకు బుద్ధి చెప్పడానికి దేశవ్యాప్తంగా రైతులు నడుం బిగిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఓటువేయబోమని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే, భారత రైతు సంఘాల సమాఖ్య (సీఐఎఫ్ఎ) సభ్యులు ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. అన్నదాతలకు ద్రోహం చేసిన మోడీ సర్కారుకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయబోమని తీర్మానించారు. సీఐఎఫ్ఎలో 13 రైతు సంఘాలకు సభ్యత్వం ఉండగా, వీటికి అనుబంధంగా వందలాది రైతు సంఘాలున్నాయి. వీటన్నింటి ద్వారా రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు ఓటేయబోమని అన్ని చోట్లా తీర్మానాలు చేస్తామని సీఐఎఫ్ఎ అధ్యక్షుడు సత్నామ్ బెహ్రూ తెలిపారు. బీజేపీకి ఓటేయకుండా, ఆయా స్థానాల్లో పొటీ చేసే స్వతంత్ర అభ్యర్థులను ఎన్నుకోవాలని రైతులను తాము అభ్యర్థిస్తున్నామని అన్నారు. 2014లో, అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన బీజేపీ.. అధికారం చేపట్టాక ఆ ఊసే మరిచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గోధుమ రైతులకు కనీస మద్దతు ధర పెంచడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. గోధుమ పంటకోసమయ్యే ఖర్చు ఆకాశాన్నంటుతుంటే మోడీ సర్కారు ప్రకటించిన రూ. 105 ఏ మూలకు సరిపోతాయని తెలిపారు.