Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీరం దాటిన తుఫాన్
- 8 మంది మృతి
- మరో ముగ్గురు మత్స్యకారుల గల్లంతు
- సిక్కోలుకు అపారనష్టం
- 3.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- నిలిచిన విమానాలు,రైళ్లు, బస్సులు
విశాఖ: తిత్లీ తుఫాను ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించింది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర బీభత్సం సృష్టించింది. అత్యంత తీవ్ర రూపం దాల్చుతూ శ్రీకాకుళం, ఒడిశాకు తీవ్ర నష్టం చేసిన 'తిత్లీ' తుఫాను గురువారం ఉదయానికే వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి వద్ద తీరం దాటింది. ఈ సమయంలో జిల్లా అంతటా పెనుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో భారీగా, అక్కడక్కడా స్వల్పంగా వర్షాలు కురిశాయి. 2014 అక్టోబర్లో జిల్లాను కకావికలం చేసిన హుదూద్ తుఫాను ప్రభావం మళ్లీ గుర్తుకు తెచ్చేలా విరుచుకుపడింది. పెను తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి, అరటి, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు 3,49,610
ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈదురుగాలుల ధాటికి ఇండ్లు, కొబ్బరి చెట్టు కూలిన ఘటనల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. కర్రివానిపాలెం-గోపాల్పూర్ మధ్యలో చేపల వేటలో ఉన్న ముగ్గురు కళాసీలు గల్లంతయ్యారు. 122 గుడిసెలు నేలమట్టమయ్యాయి. 509 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 89 పశువులు చనిపోయాయి. 300 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అనేక మండలాల్లో గెడ్డలు, చెరువులకు గండ్లు పడి ఆయా గ్రామాలకు రాకపోకలకు స్థంభించాయి. పదుల సంఖ్యలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి విశాఖకు రావల్సిన విమానాలు, వందలాది సంఖ్యలో బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను కారణంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేశారు. రాత్రి 7 గంటలకు శ్రీకాకుళంకు రోడ్డు మార్గంలో చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టరేట్కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిత్లీ తుఫాను వాయువ్య దిశగా వెళ్లి పశ్చిమబెంగాల్లోకి వెళ్లినట్టు, అక్కడక్కడా వర్షాలు మాత్రం శుక్రవారం కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.