Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లుక్ఔట్ సర్క్యూలర్ను నీరుగార్చిన సీబీఐ
- బ్యాంకు స్కాంలో నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసిన చర్య
న్యూఢిల్లీ: సుమారు తొమ్మిది వేల కోట్ల రుణాలను ఎగవేసిన విజరు మాల్యా విదేశాలకు పారిపోయేందుకు లుక్ఔట్ నోటీసులను సీబీఐ నీరుగార్చినట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు ఎయిర్సెల్ మాజీ ప్రమోటర్, ఐడీబీఐ బ్యాంకులో 600 కోట్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న సి శివశంకరన్పై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులను సీబీఐ నీరుగార్చినట్టు విశ్వసనీయ సమాచారం. శివశంకరన్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం కల్పించేలా ఈ నోటీసులను మార్చివేసినట్టు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్(ఐఓ), సంబంధిత సీబీఐ బెంగుళూర్ బ్రాంచ్ హెడ్ ఈ నిర్ణయంతో విబేధించినా సీబీఐ ఉన్నత అధికార వర్గాలు ఈ చర్యకు పూనుకున్నట్టు తెలిసింది. దీనికోసం బెంగుళూర్లోని బ్యాంక్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ సెల్(బీఎస్ఎఫ్సీ)లో దాఖలైన ఈ కేసును ఢిల్లీలోని యాంటి కరప్షన్ యూనిట్-3కు బదిలీ చేసింది. 2010 నుంచి 2014 మధ్యకాలంలో ఐడీబీఐలో జరిగిన 600 కోట్ల కుంభకోణానికి సంబంధించి సి శివశంకరన్, ఐడీబీఐ అధికారి ఎంఎస్ రాఘవన్ సహా 39మందిపై ఈ ఏడాది ఏప్రిల్లో బీఎస్ఎఫ్సీలో సీబీఐ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, శివశంకరన్ రాకపోకలపై సీబీఐ కఠినంగా వ్యవహరించకుండా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. శివశంకరన్పై జారీ అయిన లుక్ఔట్ నోటీసులపై నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సూచనలు చేయాల్సిందిగా బెంగుళూర్ బ్రాంచ్ హెడ్, సంబంధిత ఐఓలకు సీబీఐ ఉన్నత వర్గాలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 2జీ స్కాంకు సంబంధించి ఎయిర్మ్యాక్సిస్ కేసులోనూ శివశంకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. a