Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాల్లోనే అధికంగా 15 లక్షల మంది
- రైల్వే ప్రమాదాల్లో 26వేలకు పైగానే
- ప్రమాదాలన్నీ నివారించదగినవే :
- ప్రభుత్వ తాజా సమాచారంలో వెల్లడి
న్యూఢిల్లీ: అవన్నీ నివారించదగిన ప్రమాదాలు. కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఆయా ప్రమాదాల్లో మరణాలు చోటుచేసుకోకుండా ఆపగలిగేవే. దేశవ్యాప్తంగా రోడ్డు, రైల్వే వంటి ఇతర ఇలాంటి ప్రమాదాల్లో గత 12 ఏండ్లలో 39 లక్షల మంది మరణించారు. ఇదంతా ప్రభుత్వ తాజా సమాచారంలో వెల్లడైంది. ఇలాంటి 'నివారించదగిన' ప్రమాదాల్లో ఇటీవల చోటుచేసుకున్న అమృత్సర్ విషాదం అన్నింటి కంటే పెద్దది. ఆ సమయంలో కార్యక్రమ నిర్వాహకులు కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే 59 మంది ప్రాణాలు నిలబడేవి. అయితే ఇలాంటి ప్రమాదాలు భారత్లో అధికంగా జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వీటిని 'అసహజ మరణాలు'గా పేర్కొంటూ వస్తోంది. 2004 నుంచి 2015 మధ్య వివిధ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్యను చూసుకుంటే.. రోడ్డు ప్రమాదాల్లోని మరణాలు అన్నిటి కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఈ 12 ఏండ్ల కాలంలో ఇందులో అత్యధికంగా దాదాపు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో మరణించిన వారి సంఖ్య 1.5 లక్షలుగా ఉన్నది. ఇది 2004లో సంభవించిన మరణాల కంటే 64శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఇక రైల్వే ప్రమాదాల్లోని మరణాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 12 ఏండ్ల వ్యవధిలో దాదాపు 26వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజుకు ఆరుగురు మృతి చెందారు. అయితే ట్రాఫిక్ ఇంజనీరింగ్ లోపం, పర్యవేక్షణ లోపం, అవగాహనారాహిత్యం, వాతావరన సమస్యలతో పాటు పలు కారణాలు ఇలాంటి ప్రమాదాలకు కారణాలు అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.
రోడ్డు, రైల్వే ప్రమాదాలే కాకుండా అగ్నిప్రమాదాలు, ఇండ్లు ధ్వంసమయ్యే ఘటనల్లోనూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం.. విద్యుదాఘాతం వంటి ప్రమాదాలు 12 ఏండ్లలో ఒక లక్షకు పైగా ప్రాణాలను బలిగొన్నాయి. నీటి మునక ఘటనల్లో మూడు లక్షల మంది మరణించారు. ఇది 2004లో 21వేలుగా ఉంగడగా.. 2015లో 30వేలకు చేరింది. అయితే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఆయా ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడమే సరైన మార్గమమని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
భారత రోడ్లతో రోజుకు 56 మంది పాదచారుల బలి
భారతదేశంలోని రోడ్లపై పాదచారులకు ఎలాంటి రక్షణా లేకుండా పోతోంది. మనదేశ రోడ్లు రోజుకు 56 మంది పాదచారుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 2014లో 12,330 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోగా..2017 నాటికి ఇది 20,457కు పెరిగింది. అనగా ఇది దాదాపు 66శాతానికి పెరిగింది. గతేడాది తమిళనాడులో అధికంగా 3,507 మరణాలు సంభవించాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(1,831), ఆంధ్రప్రదేశ్(1,379) లు ఉన్నాయి.