Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స.హ జవాబులో వెలుగులోకి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం ప్రకటిస్తున్న కార్యక్రమాలు, పథకాల ప్రచారం కోసం ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల నిధులు ఖర్చు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది బీజేపీ సర్కారు తన మూడేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు తమ వద్ద వున్న 82 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని స.హ చట్ట దరఖాస్తుకు జవాబుగా ప్రభుత్వం వెల్లడించింది. 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేపట్టిన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' (అందరితో అందరి ప్రగతి కోసం) నినాదంతో ప్రభుత్వ వార్షికోత్సవాలను నిర్వహించిన అధికార పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించినట్లు స.హ జవాబులో ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 583 జిల్లాల్లో ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమాల నిర్వహణకు నిధులు అందచేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. స.హ కార్యకర్త నీరజ్శర్మ దాఖలు చేసిన స.హ దరఖాస్తులపై స్పందించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కార్యక్రమాల కోసం తాము ఎందుకు, ఎలా నిధులు వెచ్చించిందీ వివరించాయి. గత ఏడాది మే నెలలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి అధ్యక్షతన జరిగిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)సమావేశంలో దేశంలోని మొత్తం 583 జిల్లాల్లో గుర్తించిన 283 జిల్లాల్లో ప్రభుత్వ నినాదం 'సబ్కాసాథ్, సబ్కా వికాస్' నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించినట్లు తెలుస్తోంది. మిగిలిన 356 జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు విద్యుత్, బొగ్గు, మైనింగ్, పౌర విమానయానశాఖ, నౌకాయానం, టెలికమ్యూ నికేషన్లు, రసాయనాలు, ఎరువులు, పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖలకు చెందిన పీఎస్యూలు నిధులు వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు స.హ జవాబు ద్వారా తెలుస్తోంది. గెయిల్ సొంతంగా 14 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు మరో 16 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల వ్యయాన్ని భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులను తెరపైకి తెచ్చి బహిరంగంగా ప్రదర్శించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.