Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన స్థానిక ఎమ్మెల్యే తరిగామి
శ్రీనగర్: కుల్గాం జిల్లా లారూ గ్రామంలో జరిగిన పేలుడులో అమాయక పౌరులు మృతి చెందడం బాధాకరమని సీపీఐ(ఎం) నేత, స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ తరిగామి అన్నారు. పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భద్రతా దళాలకూ, ఉగ్రవాదులకూ మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేలుడుకు ముందు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన విషయం గమనార్హం. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని తరిగామి డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన పేలుడులో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.మరో 40మంది వరకూ గాయపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం పుల్వామా జిల్లాలో జరిగిన మరో సంఘటనలో గర్భిణీ మహిళ ఒకరు మృతి చెందారు. కాశ్మీర్లో ఇటువంటి ఘటనలు రోజూ ఏదో ఓ చోట జరుగుతుండటం బాధాకరమని తరిగామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో పౌరుల హత్యాకాండను తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంఘీభావం తెలిపారు. కాశ్మీర్ సమస్య పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అక్కడ హింస కొనసాగుతున్నదని ఆయన అన్నారు. కేంద్రం వైఖరితో కాశ్మీరీల్లో పరాయీకరణ భావం పెరుగుతోందని ఆయన అన్నారు. దీంతో, ఆగ్రహం చెందిన యువతతోపాటు వృద్ధులూ ప్రాణాంతకమైన ఎన్కౌంటర్ ప్రాంతాలకు దూసుకువస్తున్నారని ఆయన వివరించారు. హింసాత్మక ఘటనల్ని నివారించేందుకు కాశ్మీరీలతో అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన కేంద్రానికి సూచించారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపడంలేదని ఆయన విమర్శిం చారు.ఆదివారం జరిగిన సంఘటనలో ఓ ఇంట్లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందిన తర్వాత స్థానికులు గుంపుగా అక్కడికి వచ్చినట్టు చెబుతున్నారు. ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను తొలగించకుండా భద్రతా దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న తర్వాతే పేలుడు జరిగినట్టు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల పట్ల సానుభూతితోనే స్థానికులు అక్కడికి చేరినట్టు తెలుస్తోంది.