Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో 68 శాతం పెరిగిన కోటీశ్వరులు : సీబీడీటీ
- నాణేనికి ఓవైపు.. నాలుగేండ్లలో భారీగా పెరిగిన సంపన్నుల సంఖ్య
- నాణేనికి మరోవైపు..
- ప్రపంచ ఆకలి సూచిలో 103వ స్థానం. ఐదుగురు చిన్నారుల్లో ఒకరికి పౌష్టికాహార లోపం : యూఎన్ఓ
- దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బ తిన్నది... : ఆర్బీఐ
- నిరుద్యోగం సమస్య అధికంగా ఉన్నది.. : అజీం ప్రేమ్జీ వర్సిటీ
- మండుతున్న నిత్యావసరాల ధరలు.. : కేంద్ర గణాంక నివేదికలు
మోడీ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో కోటీశ్వరులు ఏకంగా 68 శాతం
పెరిగారు. ఆశ్రిత పెట్టుబడులు, క్విడ్ ప్రోకో ఇలా కొత్తకొత్త పేర్లతో కార్పొరేట్లు కోట్లు పోగేసుకుంటున్నారన్న కఠోరవాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఏ ప్రయివేటు సంస్థ చేసిన అధ్యయనమో.. మరొకటో కాదు. కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలివి.
సరిగ్గా నాలుగున్నరేండ్ల కిందట మోడీ ఎన్నికల వాగ్దానాల్లో దేశ జనమంతా తడిసిముద్దయ్యారు. కానీ ఎన్డీఏ సర్కారు ఏవిధంగా కార్పొరేట్లకు అండగా నిలుస్తున్నది. సామాన్య, మధ్యతరగతి బతుకులు ఏవిధంగా ఆగమైపోతున్నాయి.? ఇలాంటి కీలకాంశాలివి..
న్యూఢిల్లీ : దేశంలో వ్యక్తిగత సంపాదన ఏడాదికి రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య 81,344కు చేరుకున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి, ప్రస్తుతానికి పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 68 శాతం పెరిగింది. ఈ గణాంకాలను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. కోటీశ్వరులు పన్ను చెల్లిస్తున్న దాన్ని బట్టి 2017-18 గణాంకాలను రూపొందించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిలోని వివరాల ప్రకారం.. దేశంలో కోటి రూపాయలకు పైగా వార్షిక ఆదాయముండి పన్ను చెల్లిస్తున్న కార్పొరేట్లు, సంస్థలు, ఉమ్మడి కుటుంబాలు, ఇతర వ్యాపారుల సంఖ్య 2014-15లో 88,649గా ఉంటే 2017-18 నాటికి 1,40,139కి(60 శాతం పెరుగుదల) చేరుకున్నది. వ్యక్తిగత ఆదాయం యేడాదికి రూ.కోటికి పైన ఉన్న వారి సంఖ్య 2014-15లో 48,416 ఉండగా.. 2017-18 నాటికి 81,344కు పెరిగింది. పన్ను బకాయిలను రాబట్టే చర్యలను ఆదాయ పన్ను శాఖ తీవ్రతరం చేసినట్టు సీబీడీటీ చైర్మెన్ సుశీల్ చంద్ర తెలిపారు. గడిచిన నాలుగేండ్లలో ఐటీ రిటర్న్స్ దాఖలులో దాదాపు 80 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు.
ఐదుగురు చిన్నారుల్లో ఒకరికి పౌష్టికాహార లోపం
దేశంలో ఐదేండ్లలోపున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని 'ప్రపంచ ఆకలి సూచి-2018' నివేదికలో వెల్లడైంది. ఐర్లాండ్ సహాయ ఏజెన్సీ 'కన్సర్న్ వరల్డ్వైడ్', జర్మనీ ఛారిటీ 'వెత్హంగర్లైఫ్' విడుదల చేసిన ఈ సూచిలో 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో ఆకలి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాక.. దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రమూ బాగా లేదని, ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బ తిన్నదని ఆర్బీఐ ఇటీవల చేసిన 'కన్స్యూమర్ కాన్ఫిడెన్స్' సర్వేలో తేలింది. దేశంలోని 13 నగరాల్లో సర్వే జరిపి ఆర్బీఐ ఈ నివేదికను రూపొందించింది. పెరుగుతున్న నిత్యావసరాల సరుకుల ధరలు, పెట్రో రేట్లు సామన్యుడిని భయాందోళనకు గురి చేస్తున్నాయని, మున్ముందు కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమే కనిపించడం లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాలు దారుణంగా తయ్యారయ్యాయని 45.5 శాతం మంది తమ స్పందనను తెలియజేశారు. గతంతో పోల్చుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని 88 శాతం మంది అభిప్రాయపడగా.. తగ్గినట్టు 3 శాతం మంది మాత్రమే చెప్పారు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల రూపొందించిన 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2018' నివేదికలో.. సాధారణంగా వృద్ధితో పాటు ఉద్యోగావకాశాలు మెరుగుపడాలి కానీ, దేశంలో ఈ రెండింటి మధ్య పొంతన లేకుండా పోయిందని పేర్కొన్నది. 2015లో నమోదైన నిరుద్యోగిత.. గడిచిన 20 ఏండ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. దేశంలో కార్మిక శక్తి 46.7 కోట్లుగా.. వీరిలో 17 శాతం మంది మాత్రమే రెగ్యులర్గా వేతనం పొందుతున్నట్టు సర్వేలో తేలింది. అంతేకాక.. రానున్న లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం కీలకం కానున్నదని పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు.
కేంద్రంలోకి యూపీఏ వచ్చినా..ఎన్డీఏ వచ్చినా కార్పొరేట్ల కనుసన్నల్లోనే నడుస్తాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు వేసేటపుడు మాత్రమే జనం..ఆ తర్వాత సంపన్న వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా పాలనకొనసాగిస్తున్నాయి.
డాలరు విలువ దిగజారిపోతోంది. స్టాక్ మార్కెట్లో విదేశీ నిల్వలు వెనక్కి మళ్లుతున్నాయి. సామాన్యుడి బతుకుమాత్రం దుర్భరంగానే మారిపోతోంది. కానీ కార్పొరేట్లు మాత్రం శత కోటీశ్వరులుగా కాసులు వెనకేసుకుంటున్నారు. ఈ విషయాన్నే తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు నివేదికలో స్పష్టమైంది. ఇది కూడా మోడీ పాలనలో నాలుగేండ్లలో 68 శాతం కోటీశ్వరులనీ పేర్కొనటం చూస్తుంటే..ఎన్డీఏ సర్కారు ఎవరిపక్షమే...దేశ జనం ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు.