Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయం వద్ద హింసాత్మకంపై పినరయి విజయన్
- అపవిత్రం చేసే హక్కు లేదన్న మంత్రి స్మృతి ఇరానీ
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హింసాత్మక ఆందోళనకు పాల్పడడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆందోళన అంతా ''ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్నదేనని'' రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నమేనని విజ యన్ ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పేర్కొ న్నారు. 10-50ఏండ్ల మధ్య వయస్సు గల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చునంటూ సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడకు వచ్చిన మహిళలను అడ్డుకోవడం, మీడియా సిబ్బందిపై దాడి చేయడం వంటి సంఘటనలు ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. ఆలయ ప్రాంగణాన్ని 'యుద్ధ భూమి'గా మార్చడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం అనుమతించదని ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు. మత విశ్వాసాలను గౌరవిస్తూనే, సుప్రీం తీర్పును అమలు చేయాల్సి న బాధ్యత కూడా తమపై వుందన్నారు. ఈ నెల 17 నుండి 22వరకు నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచినపుడు ఆలయం వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. రాష్ట్ర పోలీసు యంత్రాం గానికి మతం రంగు పులిమేందుకు సంఘ పరివార్ చేసిన యత్నాన్ని నీచమైన ప్రయత్నం గా ఆయన అభివర్ణించారు. ఆలయంలో శాంతి భద్రతల నిర్వహణకు నియమించిన ఐజిపిలు మనోజ్ అబ్రహం, ఎస్.శ్రీజిత్లపై సైబర్ దాడిని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే తాను గుడి మూసివెళ్ళిపోతానని ఆలయ పూజారి రాజీవరు అనడాన్ని కూడా ముఖ్యమంత్రి విమర్శించారు.
స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా వుండగా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శబరిమల వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ప్రతి ఒక్కరికీ ప్రార్ధించే హక్కు వుంది. కానీ, అగౌరవపరిచే, అపవిత్రం చేసే హక్కు లేదు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించి అంశం. రుతుస్రావ సమయంలో వాడిన శానిటరీ న్యాప్కిన్లను మీ స్నేహితుల ఇంటికి తీసుకెళతారా? తీసుకెళ్లరు గదా! మరి అటువంటి పనే మీరు ఆలయానికి వెళ్ళినపుడు చేయడం గౌరవప్రదమైన పనేనా?'' అని ఆమె ప్రశ్నించారు. అయినా ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ముంబయిలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లు నిర్వహించిన యంగ్ థింకర్స్ సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఒక మంత్రిగా తాను సుప్రీం తీర్పుపై బహిరంగంగా వ్యాఖ్యానించరాదని అన్నారు. అయితే తన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. బేస్ కేంప్ల వద్ద జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె, తాను హిందువునని, పార్శీని వివాహం చేసుకున్నానని, అంథేరీలోని పార్శీ ఆలయానికి వెళ్ళినపుడు తనని లోపలకు అనుమతించలేదని, తన భర్త, పిల్లలను పంపి తాను బయట వేచి వున్నానని చెప్పారు