Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతిష్టకు దెబ్బ
- డైరెక్టర్, చైర్మెన్గా తమవాళ్లను నింపే ప్రయత్నం
- ఆందోళనలో సంస్థ సిబ్బంది, ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ : కళలు, సినిమారంగంలో భారతదేశం పేరు ప్రఖ్యాతుల్ని నలుదిశలకు వినిపించేలే చేసిన ప్రతిష్టాత్మక సంస్థ 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్, షారూక్ఖాన్, ఓంపురి, ఇర్ఫాన్ ఖాన్...మొదలైన బాలీవుడ్ నటులకు ఓనమాలు నేర్పింది ఈ సంస్థే. విషయమేంటంటే, కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక..ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలోకి రాజకీయాలు ప్రవేశించాయి. ఆర్ఎస్ఎస్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తమకు అనుకూలమైనవారిని సంస్థలోకి జొప్పించే పనిని మొదలుపెట్టింది. దీంతో సంస్థ కార్యకలాపాలు కలుషితమయ్యాయి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ) చెర్మెన్, డైరెక్టర్ పదవుల్లో తమవారిని కూర్చోబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ 'సంస్కార్ భారతీ' పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇది కాస్తా ఇప్పుడు జాతీయ మీడియాలో, సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశంగా మారింది.
సమస్యేంటి ?
ముంబయి యూనివర్సిటీ అకాడమీ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్కు హెడ్గా ఉన్న వామన్ కేంద్రేను 2013లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఎస్డీకి డైరెక్టర్గా నియమించింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది మొదట్లో ముగిసింది. మరో ఆరునెలలు పదవీకాలాన్ని పొడగించిన మోడీ సర్కార్, అంతలోనే మనసు మార్చుకొని డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలాగే సంస్థ చైర్మెన్ రతన్ తైయ్యాం(మణిపూర్ కళాకారుడు) పదవీకాలం కూడా గతేడాది ముగిసింది. దీంతో డైరెక్టర్, చైర్మెన్ స్థానాల్ని భర్తీ చేయకుండా ఎన్ఎస్డీని ఇష్టానుసారంగా తనవాళ్లతో మోడీ సర్కార్ నడుపుతోంది.
ఎంపిక ఆర్ఎస్ఎస్ చేతుల్లో..
వామన్ కేంద్రే వెళ్లిపోయాక, సంస్థకు 'యాక్టింగ్ డైరెక్టర్'గా ఆర్ఎస్ ఎస్కు సన్నిహితుడు, హితుడు అయిన సురేష్ శర్మను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నియమించింది. సంస్థ డైరెక్టర్, చైర్మెన్ పదవుల్ని భర్తీ చేయకుండా, ఇంఛార్జ్లతో నడిపించటం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక నాయకత్వలేమి సంస్థలో కొట్టొచ్చినట్టు కనపడుతోందని ఎన్ఎస్డీ ప్రొఫెసర్లు, సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో నలుగురు పేర్లతో కేంద్ర సాంస్కృతిక శాఖ తుదిజాబితా సిద్ధంచేసి, ఆర్ఎస్ఎస్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.
ప్రస్తుత 'యాక్టింగ్ డైరెక్టర్'గా ఉన్న సురేష్ శర్మ, తులసీధరా కురూప ్(కేరళ నాటక రచయిత), లతీఫ్ ఖతానా(కాశ్మీర్ కళాకారుడు), కేవల్ ధాలి వాల్(పంజాబ్)లతో తుదిజాబితాను కేంద్రం రూపొందించింది. ఇందులో సురేష్ శర్మ, తులసీధరా కురూప్ల వైపు ఆర్ఎస్ఎస్ మొగ్గుచూపుతోంది. వీరిద్దరిలో ఒకర్ని ఎన్ఎస్డీ డైరెక్టర్గా, మరొకర్ని సంస్థ చైర్మెన్గా నియమించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అభ్యుదయ భావజాలమన్నా, వామపక్షమన్నా సురేష్ శర్మకు పడదని, అనేక సందర్భాల్లో సంస్థ ఫ్యాకల్టీ సభ్యులతో ఘర్షణకు దిగారని వార్తలు వెలువడుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ విభాగం 'సంస్కార్ భారతీ' ముఖ్యులతో సురేష్ శర్మకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనగనుక డైరెక్టర్గా ఎంపికైతే ఆర్ ఎస్ఎస్ సభ్యులంతా సంతోషిస్తారని, అలాగే కేరళకు చెందిన తులసీధరా కురూప్ను కూడా ఎన్ఎస్డీ ముఖ్యస్థానంలో నియమించాలని ఆర్ఎస్ ఎస్ కోరుకుంటోందని సంస్థలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు చెబుతున్నారు.
సంస్థ భవిష్యత్తుపై ఆందోళన
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం అక్కడున్న ప్రొఫెసర్లను, ఇతర సిబ్బందిని తీవ్రంగా బాధిస్తోంది. పాలనాపరంగా సమర్ధుడైనవారు, సృజనాత్మకతను ప్రోత్సహించేవారు డైరెక్టర్గా రావాలని వారు కోరుకుంటున్నారు. శిక్షణకోసం వచ్చిన యువ కళాకారుల సున్నితమైన అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించేవారు నాయకత్వ స్థానంలో ఉండాలని వారు చెబుతున్నారు. తుది జాబితాలోని పేర్లపై వారు అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు.