Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: గజ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. తుఫాన్ ధాటికి దాదాపు 32 మంది మృతి చెందినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గజ తుఫాన్ శుక్రవారం ఉదయం తమిళ నాడు తీరాన్ని దాటింది. తమిళనాడు తీరంలోని నాగపట్టణం-వేదారణ్యం మధ్య తీరాన్ని దాటడంతో రాష్ట్ర వ్యాప్తం గా భారీ వర్షాలు కురిశాయి. సమాచార వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగ పట్టణం జిల్లాలో చెట్లు,హౌర్టింగులు నేలకొరిగాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ సౌకర్యం దెబ్బతిన్నది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరావాస, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి సేలంలో విలేకరులకు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టప రిహారం చెల్లించనున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.
ఇడుక్కిలో భారీ వర్షాలు
గజ తుఫాన్ కారణంగా కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో గురువారం రాత్రి స్వల్పంగా ప్రారంభమైన వర్షం శుక్రవారం నాటికి తీవ్రతరమైంది. ఎత్తైన పర్వత శ్రేణులకు చేరుకునేందుకు రాత్రి వేళల్లో ఘాట్ రోడ్డుపై ప్రయాణించొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సీఎంకు రాజ్నాథ్ ఫోన్
తమిళనాడులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి పళనిస్వామిని అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో తలెత్తిన పరిస్థితి నుంచి కోలుకునేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహా యాన్ని అందిస్తామని రాజ్నాథ్ హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సాయమందించాల్సిందిగా హోం శాఖ కార్యదర్శిని కోరినట్టు రాజ్నాథ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పాఠశాలలకు సెలవు
గజ తుఫాన్ తీవ్రతకు నాగపట్టణంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నాగపట్టణం, తిరువూర్, తంజావూర్ జిల్లాలో భారీ వర్షాలు కురియడమే కాకుండా కొండ చరియలు విరిగి పడ్డాయి. పలు ప్రాంతాలలో చెట్లు కూకటి వేళ్ళతో సహా పడిపోయాయి. నాటపట్టణంలోనూ, పలు తీర ప్రాంతాలలోనూ ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.