Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 ఎన్నికలపైనా వ్యవసాయ సంక్షోభ ప్రభావం!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సమాధానం చెప్పారు. బ్యాలెట్ ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు తాజా ఫలితాలే నిదర్శనం. మధ్యప్రదేశ్లో మాల్వా-నిమార్, రాజస్థాన్లో హదోతి రీజియన్లు బీజేపీకి బలమైన కోటలాంటివి. ఈ రెండు రాష్ట్రాల మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజేలు ఈ రీజియన్ల నుంచే ప్రాతినిధ్యం వహించారు. అయితే రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరుగడంతోపాటు రైతు ఆందోళనలకు ఈ రెండు ప్రాంతాలు కేంద్ర స్థానాలుగా మారాయి. మధ్యప్రదేశ్లో ఆందోళనలు చేసినందుకు రైతులపై కాల్పులు జరిగిన మందసోర్ కూడా మాల్వా-నిమార్లోనే ఉండటం గమనార్హం. అయితే వ్యవసాయ సంక్షోభాన్ని గుర్తించిన కాంగ్రెస్ అందుకు అనుగుణంగా ప్రచారాలు చేయడం, మ్యానిఫెస్టోలోనూ రుణమాఫీ, మద్దతు ధరను ప్రముఖంగా ప్రకటించింది. దీంతో కాషాయ కోటకు బీటలు పడటం మొదలైంది. గత ఎన్నికల్లో ఈ రీజియన్లలో అతికష్టంగా సింగిల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మాత్రం దూసుకుపోయింది. 61 స్థానాలు గల మాల్వా నిమార్లో 2013లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లను గెలుపొందగా, బీజేపీ 51 సీట్లను గెలుచుకుంది. ఈ సారి మాత్రం కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయంసాధించగా, బీజేపీ 32స్థానాలకే పరిమితమైంది. రాజస్థాన్లోని హదోతి(17 స్థానాలు)లోనూ ఇదే పరిస్థితి. 2013లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్కటి మాత్రమే గెలుచుకోగా బీజేపీ మిగతా అన్ని సీట్లను ఖాతాలో వేసుకుంది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలుపొందింది. రాజే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎన్నికలు సమీపిస్తుండగా జూన్లో అమలు చేయడం గమనార్హం.