Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే కె.ఈరన్నకు సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈరన్న ఎన్నిక చెల్లదని, వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కె.ఈరన్న సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీిషన్ను కొట్టివేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం నాడు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈరన్న తరపున సీనియర్ న్యాయవాది బసవప్రభు పాటిల్ వాదనలు వినిపించారు. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని, ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఈరన్న, తిప్పేస్వామి సహా 12మంది ఉండగా తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఉత్తర్వులు జారీ చేయడం తగదని వాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకో మూడు నెలలు మాత్రమే ఉందని, అందువల్ల ఈరన్ననే ఎమ్మెల్యేగా కొనసాగించాలని అభ్యర్థించారు. కాగా, తిప్పేస్వామి తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ వాదనలు వినిపిస్తూ ఈరన్నపై ఉన్న క్రిమినల్ కేసులను అఫిడవిట్లో పొందుపరచలేదని, అలాగే ఈరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విషయాన్ని కూడా పొందుపరచలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అఫిడవిట్లో క్రిమినల్ కేసులను తప్పనిసరిగా ప్రస్తావించాలని, ఈ మేరకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్ను కొట్టివేసింది.