Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత తగ్గిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీలలో మహిళల ప్రాతి నిధ్యం తగ్గుతూ వస్తున్నది. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం అసెం బ్లీ ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్యా క్రితంసారి కంటే తగ్గింది. ఎన్నికల బరిలోకి దిగిన మహిళా అభ్యర్థుల సంఖ్య క్రితంసారి కంటే పెరిగింది. కానీ అదే స్థాయిలో వారిని ఎన్నుకోకపోవడం గమనార్హం. ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడంతోపాటు ఎన్నికైన మహిళల సంఖ్యకూడా పెరిగింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 687 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా.. కేవలం 62మంది(9శాతం) మహిళా అభ్యర్థులు మాత్రమే గెలుపొందినట్టు ఇండియా స్పెండ్ రిపోర్టు వెల్లడించింది. 2013-14 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకంటే అధికంగా 77మంది(11శాతం) మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు.
49శాతం మంది మహిళా జనాభాగల మిజోరంలో ఒక్క మహిళా కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. గత ఎన్నికలోనూ ఇదే పరిస్థితి. అయితే ఎన్నికల బరిలోకి దిగిన మహిళా అభ్యర్థుల సంఖ్యమాత్రం పెరిగింది. 2013లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 108 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 30 మంది విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 235 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా.. 22మంది మాత్రమే గెలిచారు. రాజస్థాన్లో క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో 152మంది మహిళలు పోటీచేయగా.. 25మంది గెలుపొందారు. తాజా ఎన్నికల్లో 182 మంది మహిళలు బరిలోకి దిగగా.. 23మంది విజయం సాధించారు. ఛత్తీస్గఢ్లో క్రితంసారి ఎన్నికల్లో 10మంది మహిళలు ఎన్నికవగా నేడు 13 మంది గెలుపొందారు. తెలంగాణలో ముగ్గురు మహిళా అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. కాగా, మహిళలకు టికెట్లివ్వడంలో రాజకీయ పార్టీలూ వివక్ష చూపుతున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్లు 12శాతానికి మించి మహిళలకు టికెట్లివ్వలేకపోవడం గమనార్హం. 'ఓటు వేయడానికి మహిళలు పెద్దసంఖ్యలో కదిలివస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో.. మహిళలకు ప్రాతినిధ్యం వహించేందుకు వారి జనాభాకు తగినట్టుగా మహిళా చట్టసభ్యులూ ఉండాలని' పెన్సిల్వేనియా వర్సిటీ స్కాలర్ రితికా కుమార్ తెలిపారు.