Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాఫెల్ ఒక్కో విమానం ధర 526కోట్ల నుంచి 1600కోట్లకు ఏ విధంగా చేరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో ఎటువంటి అనుమానించదగ్గ అంశాలు లేవంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన దానిపై రాహుల్ స్పందించారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధికారిక కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
'ప్రధాని మోడీ ఇప్పటి వరకు రాఫెల్ ఒప్పందంపై మాట్లాడలేదు. తీర్పు వచ్చిన తర్వాత రక్షణ మంత్రి సీతారామన్, కేంద్రమంత్రి జైట్లీ మాత్రమే మాట్లాడారు. రాఫెల్పై కాగ్ ఇచ్చిన నివేదిక ఏమిటో ప్రభుత్వం మాకు వివరించాలి. అసలు కాగ్ రిపోర్ట్ ఎక్కడీ కాగ్ రిపోర్ట్ పీఏసీకి ఇచ్చినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. రాఫె˜ల్ ధరల వివరాలు పీఏసీ అధ్యక్షుడితో చర్చించినట్టు సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకు పీఏసీ అధ్యక్షుడు ఖర్గేకి కాగ్ నివేదిక అందలేదు. వేరే పార్లమెంట్లో పీఏసీకి సమాంతరంగా మరో పీఏసీ నడుస్తుందేమో. ఆ పార్లమెంట్ ఫ్రాన్స్దేమో. మోడీ తన సొంత పీఏసీని నడిపించగలరు. కాగ్ నివేదికను పీఏసీ ఇప్పటి వరకు చూడలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం చూసింది'.
'దేశ కాపలాదారుడు చోరీకి పాల్పడ్డారని దేశమంతా చూసింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. భారత ప్రధాని మోడీ తన స్నేహితుడు అనిల్ అంబానీతో కలిసి దోచుకున్నారు. అది మేం నిరూపిస్తాం. ఫ్రాన్స్లో ఏం జరిగిందనేది మోడీకి ఒక్కరికి మాత్రమే తెలుసు' అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి రాఫెల్పై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.