Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో సీపీఐ(ఎం) నేతను గెలిపించుకున్న రైతులు
- మోడీ ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థికి తప్పని ఓటమి
జైపూర్: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత పలుకబడితోనో, డబ్బు, వారసత్వం, అధికారుల అండతోనో గెలిచిన వారే. కానీ, రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లా భద్ర నియోజకవర్గం నుంచి గెలుపొందిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యే బల్వాన్ పునియా మాత్రం రైతుల అండతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయిన సంజీవ్ కుమార్పై ఆయన 23 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దాదాపు పదిహేనేండ్లుగా ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పునియా గళమెత్తుతున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం వారితోనే మమేకమయ్యారు. సామాన్య, పేద ప్రజల ఇబ్బందులపై అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీశారు. పునియాను నిలువరించడానికి బీజేపీ సర్కారు ఆయనపై ఇప్పటివరకు 33 కేసులు పెట్టింది. వీటిలో పదమూడింటిలో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఆర్ట్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన పునియా.. ఈసారి అసెంబ్లీలో రైతులతో పాటు నిరుద్యోగులు, యువకులు, మహిళల సమస్యల పట్ల పోరాడతానని అంటున్నారు. పునియా తండ్రి కూడా రైతే. వ్యవసాయం కోసం ఆయన తండ్రి కూడా బ్యాంకుల వద్ద రూ. 50 వేల వరకు అప్పు చేసి ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. తన గెలుపులో రైతులే కీలక పాత్ర పోషించారని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ అభ్యర్థి కోసం ప్రధాని మోడీతో పాటు బీజేపీ పెద్ద నాయకులు సైతం వచ్చి ఇక్కడ ర్యాలీలు, సభలు చేపట్టారు. కానీ, ప్రజలు మాత్రం తమ కోసం పోరాడుతున్న పునియానే గెలిపించుకున్నారు. 2006లో రావల్-ఘర్సానాలో రైతులు పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గానూ అప్పటి బీజేపీ సర్కారు.. శాంతిని భంగపరుస్తున్నా డంటూ పునియాను ఆరు నెలలు జైలులో ఉంచింది. అప్పటికీ ఆయన వయస్సు 27 ఏండ్లు మాత్రమే. అప్పటినుంచి ఆయన రైతు సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. 2017లో రాజస్థాన్లో పెద్ద ఎత్తున జరిగిన రైతుల బీమా ఉద్యమం పునియా ఆధ్వర్యంలోనే సాగింది. దీని తర్వాత రైతులకు తమ పంటలకు సంబంధించిన బీమా డబ్బులు రావడం గమనార్హం. ఇక, కొన్ని నెలల క్రితం హనుమాన్గఢ్లో 38 రోజుల పాటు రైతులు చేసిన ఉద్యమానికీ పునియానే నాయకత్వం వహించారు.